చెన్నై-పోర్ట్బ్లెయిర్ సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్టు ప్రారంభం ఈ నెల 10న
ABN, First Publish Date - 2020-08-08T00:54:56+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న చెన్నై-పోర్ట్బ్లెయిర్ అనుసంధాన ప్రాజెక్టును
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న చెన్నై-పోర్ట్బ్లెయిర్ అనుసంధాన ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 2,300 కిలోమీటర్ల పొడవైన ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) ప్రాజెక్టు సముద్ర గర్భంలో నిర్మితమైంది. అండమాన్-నికోబార్ దీవుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. దీనిని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.
ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు పోర్ట్బ్లెయిర్, స్వరాజ్ ద్వీప్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్, కమోర్టా, గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలాండ్, రంగత్లను కలుపుతుంది.
ఈ ప్రాజెక్టు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా వేగంగా మొబైల్, ల్యాండ్లైన్ టెలికాం సేవలు అందుతాయి. ప్రస్తుత సామర్థ్యం కన్నా మూడు నుంచి నాలుగు రెట్ల వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతుంది. సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో డేటా అందుతుంది.
ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2018 డిసెంబరు 30న పోర్ట్ బ్లెయిర్లో శంకుస్థాపన చేశారు. రూ.1,224 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిని సకాలంలో పూర్తి చేయడం విశేషం.
చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మధ్య సెకనుకు 2x200 గిగాబిట్స్ బ్యాండ్విడ్త్, పోర్ట్ బ్లెయిర్, ఇతర దీవుల మధ్య సెకనుకు 2x100 గిగాబిట్స్ బ్యాండ్విడ్త్ సేవలు అందుతాయి.
ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఇంటర్నెట్ వినియోగదారులకు ఖర్చులు తగ్గుతాయి.
Updated Date - 2020-08-08T00:54:56+05:30 IST