దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అన్నదే కేంద్రం అభిమతం : ఆర్.ఎన్.రవి
ABN, First Publish Date - 2020-12-01T21:06:16+05:30
దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతమని నాగాలాండ్ గవర్నర్, నాగా
న్యూఢిల్లీ : దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతమని నాగాలాండ్ గవర్నర్, నాగా చర్చల మధ్యవర్తి ఆర్.ఎన్. రవి స్పష్టం చేశారు. ‘‘దేశంలో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారమే అంతిమం. ఈ రెండు విషయాలపై, భారత్ ఎప్పటికీ, ఎవరితోనూ సంప్రదింపులు జరపదు. వీటిని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు ప్రయత్నించినా వారిని సహించదు. దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అన్నది భారత ప్రభుత్వ స్పష్టమైన విధానంగా ఉంది. దీనికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా అది పచ్చి అబద్ధమే.’’ అని ఆర్.ఎన్. రవి కుండబద్దలు కొట్టారు. నాగాల ప్రత్యేకతను కేంద్రం ఇప్పటికే గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. నాగా రెబెల్స్కు, కేంద్రానికి మధ్య ఉమ్మడి అవగాహన 2019 లోనే వచ్చిందని, అయినా సరే... కొందరు దానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘గోడలపై రాతలు రాసే వారికి నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నా. బయటికి వచ్చి నాగా ప్రజల గొంతులను ఆలకించండి. ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారి కోరికలను గౌరవించాలని నేను కోరుతున్నాను.’’ ఆర్.ఎన్. రవి పేర్కొన్నారు.
Updated Date - 2020-12-01T21:06:16+05:30 IST