‘కుట్ర’ ఎందుకు కాదంటే..
ABN, First Publish Date - 2020-10-01T17:02:23+05:30
బాబ్రీ మసీదు విధ్వంసం ముందస్తు పథకం ప్రకారం జరిగింది కాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో కుట్ర లేదని...
బాబ్రీ మసీదు విధ్వంసం ముందస్తు పథకం ప్రకారం జరిగింది కాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో కుట్ర లేదని... బాబ్రీ కూల్చివేత అప్పటికప్పుడు, అనుకోకుండా, ఆకస్మికంగా జరిగిందని వెల్లడించింది. నిజానికి నిందితుల్లో కొందరు బాబ్రీ కట్టడాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని వెల్లడించింది.
‘‘కరసేవకులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయానికి రామ్లల్లాతోపాటు మరిన్ని విగ్రహాలు అందులోని గర్భ గృహంలోనే ఉన్నాయి. ఆలయ పూజారి సత్యేంద్ర దాస్ ఆ విగ్రహాలను బయటికి భద్రంగా తీసుకొచ్చారు. బాబ్రీ కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదనేందుకు ఇదే నిదర్శనం’’ అని నిందితుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. వివాదాస్పద కట్టడానికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ‘రామకథా కుంజ్’ వేదికపైన బీజేపీ, వీహెచ్పీ అగ్రనేతలున్నారు. లాంఛనప్రాయమైన కరసేవకు మాత్రమే పరిమితం కావాలన్న నేతల సూచనను కరసేవకులు పట్టించుకోలేదు. కట్టడాన్ని కూల్చివేయవద్దని అశోక్ సింఘాల్ కోరినా వినిపించుకోలేదు. ఇక... నిందితులకు వ్యతిరేకంగా సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో క్యాసెట్లు ‘సీల్’ చేసి లేవు. వాటిని ప్రయోగశాలలో కూడా పరీక్షించలేదు. ఆ టేపుల్లో మాటలను మార్చివేశారు. నిజానికి... ఒక సౌహార్ధ్ర భావనతో, మతపరమైన కార్యక్రమంగా మాత్రమే కర సేవ చేయాలని భావించినా... కొందరు దుండగులు కరసేవను భగ్నం చేసేందుకే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలా జరిగే అవకాశముందని స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం ముందుగానే హెచ్చరించింది.’’
- విమల్ కుమార్ శ్రీవాస్తవ్, డిఫెన్స్ న్యాయవాది
Updated Date - 2020-10-01T17:02:23+05:30 IST