ఒంటిమీద నూలుపోగు లేకుండా.. రష్యా ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు..
ABN, First Publish Date - 2020-09-22T17:55:02+05:30
విష ప్రయోగం కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్టు చెబుతున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ..
మాస్కో: విష ప్రయోగం కారణంగా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనట్టు భావిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ రష్యా అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. చికిత్స నిమిత్తం తనను జర్మనీకి పంపిస్తున్నప్పుడు ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపారని ఆయన పేర్కొన్నారు. ‘‘వాళ్లు నన్ను జర్మనీకి పంపే ముందు నా దుస్తులన్నీ లాగేసుకున్నారు. నేను కోమాలో ఉండగా ఒంటిమీద నూలుపోగు లేకుండా చేసి పంపించారు. నా శరీరంపై విషపూరిత రసాయనం ఉన్నట్టు తేలింది. అందువల్ల నా దుస్తులు అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తాయి...’’ అని నావల్నీ పేర్కొన్నారు. రష్యా అధికారులు వెంటనే తన దుస్తులు తనకు పంపాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి అయిన నావల్నీ... ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం సైబీరియాలోని తామ్స్క్ నుంచి మాస్కోకు ఆయన ఓ విమానంలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని ఓమ్స్క్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్చేశారు. విమానం ఎక్కేముందు ఆయన టీ మాత్రమే తీసుకున్నారనీ... బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారని నావల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ పేర్కొన్నారు. అందులోనే ఏదో విష పదార్థం కలిపి ఉంటారనీ ఆమె చెబుతుండగా.. ఆయన సన్నిహితులు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నావల్నీపై విష ప్రయోగం జరిగినట్టు వస్తున్న వార్తలను రష్యా అధికార మీడియా ఖండించింది.
Updated Date - 2020-09-22T17:55:02+05:30 IST