సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు.. మాయావతి డిమాండ్
ABN, First Publish Date - 2020-07-10T20:48:48+05:30
గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని..
లక్నో: గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. కాన్పూరు ఎన్కౌంటర్, ఆ తర్వాత వికాస్ దూబేను ఎన్కౌంటర్లో కాల్చిచంపడంపై విచారణ జరగాలని ఆమె ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
'కాన్పూర్ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు పోలీసుల కుటుంబాలకు న్యాయం జరగాలి. పోలీసులకూ, నేరపూరిత రాజకీయ శక్తుల మధ్య ఉన్న సంబంధాలను గుర్తించి, వారిని చట్టం ముందుకు తీసుకురావాలి' అని మాయావతి ఆ ట్వీట్లో అన్నారు. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే నేరరహిత ఉత్తరప్రదేశ్ సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
దూబేను గురువారం ఉదయం ఉజ్జయిని పోలీసులు అరెస్టు చేసారు. గత కొద్ది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న దూబే ఒక ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్తు గుర్తుపట్టారు. కాన్పూర్లో గత వారం పోలీసు బృందంపై ఆయన ముఠా సభ్యులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు హతమయ్యాయి. ఈ ఘటన దూబే అరెస్టుకు దారితీసింది.
Updated Date - 2020-07-10T20:48:48+05:30 IST