లాక్డౌన్ పొడిగింపు?
ABN, First Publish Date - 2020-04-08T08:36:47+05:30
లాక్డౌన్ లేకుంటే.. ఒక కరోనా రోగి కేవలం 30 రోజుల్లో మరో 406 మందికి వైర్సను అంటించగలడు. అదే లాక్డౌన్ అమలవుతూ, ప్రజలంతా భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉంటే ఒక కరోనా రోగి నుంచి కేవలం 2.5 మందికే ఇన్ఫెక్షన్ సోకుతుంది.
పొడిగింపు దిశగా ఆలోచిస్తున్నాం
రాష్ట్రాలు.. నిపుణులది అదే కోరిక.. లాక్డౌన్పై కేంద్రం
లాక్డౌన్ లేకుంటే.. ఒక కరోనా రోగి కేవలం 30 రోజుల్లో మరో 406 మందికి వైర్సను అంటించగలడు. అదే లాక్డౌన్ అమలవుతూ, ప్రజలంతా భౌతిక దూరం పాటించే పరిస్థితి ఉంటే ఒక కరోనా రోగి నుంచి కేవలం 2.5 మందికే ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఐసీఎంఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఒక కరోనా బాధితుడి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే రేటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సగటున 1.5 నుంచి 4 మధ్యలో ఉందన్నారు. లాక్డౌన్ ప్రభావంతో చాలామేరకు వైరస్ వ్యాప్తి వేగం తగ్గిందని స్పష్టంచేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్డౌన్ను ఏప్రిల్ 14కు మించి పొడిగించాలని కోరుతున్నాయని, నిపుణులు కూడా అదే సూచిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తామూ పొడిగింపు దిశగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని, ఊహాగానాలకు వెళ్లొద్దని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పా రు. దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్డౌన్ దేశంలో కొనసాగుతోం ది. నిత్యావసరాలను, అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తున్నారు. లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు ఉంది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేస్తే పరిస్థితి ఘోరంగా తయారవుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం ప్రధాని మోదీ సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్డౌన్ను పొడిగించాలని కేంద్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్లు కూడా పొడిగింపు మంత్రం పఠించాయి. లాక్డౌన్ పొడిగింపు ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ సూచనప్రాయంగా చెప్పారు. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహలోత్ ప్రకటించారు. వచ్చే ఏడు రోజులు దేశ ప్రజలకు కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ఏడు రోజుల ప్రగతిని బట్టే లాక్డౌన్ ఎత్తివేత వ్యూహం ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థల మధ్య దేన్ని ఎంచుకోవాలన్నపుడు తాను ప్రజారోగ్యానికే ఓటేస్తానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మరో రోజు వరకు ఆగుతుందని, ప్రజారోగ్యానికి ఆ వెసులుబాటు లేదన్నారు. ఏప్రిల్ 14నే లాక్డౌన్ పూర్తిగా ఎత్తేస్తారని ఆశపడొద్దని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అన్నారు.
హాట్స్పాట్లలో కొనసాగనుందా?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు ఉద్యోగులు రావడానికి అనుమతించాలని ఇటీవలే ప్రధాని మోదీ నిర్ణయించారు. దశల వారీగా లాక్డౌన్ ఎత్తేస్తారని, హాట్ స్పాట్లుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే లాక్డౌన్ కొనసాగుతుందని అంటున్నారు. వైర్సను నివారించేందుకు వాక్సిన్ లేనందువల్ల లాక్ డౌన్ విధించడమే శరణ్యమని చెప్పారు.
ఆ దిశగా ఆలోచిస్తున్నాం రాష్ట్రాలు కోరుతున్నాయి నిపుణులు అదే సూచిస్తున్నారు తుది నిర్ణయం తీసుకోలేదు: లవ్
వచ్చే వారం దేశానికి కీలకం సహకరించండి: వెంకయ్య
Updated Date - 2020-04-08T08:36:47+05:30 IST