వైద్యులకు కర్ణాటక వైద్య మండలి హెచ్చరిక
ABN, First Publish Date - 2020-08-14T22:15:57+05:30
కోవిడ్-19 సోకని, ఇతర వ్యాధిగ్రస్థులకు వైద్య చికిత్స చేయడానికి నిరాకరించే వైద్యులపై
బెంగళూరు : కోవిడ్-19 సోకని, ఇతర వ్యాధిగ్రస్థులకు వైద్య చికిత్స చేయడానికి నిరాకరించే వైద్యులపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక వైద్య మండలి (కేఎంసీ) తెలిపింది. ఇటువంటి వైద్యులపై మెడికల్ ఎథిక్స్ కోడ్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు హైకోర్టుకు శుక్రవారం తెలిపింది.
కోవిడ్-19 సోకని ఇతర వ్యాధిగ్రస్థులకు చికిత్స చేసేందుకు ఎవరైనా మెడికల్ ప్రాక్టీషనర్, ఏదైనా ప్రైవేటు ఆసుపత్రి తిరస్కరించినట్లయితే, బాధిత రోగులు ఫిర్యాదు చేసేందుకు హెల్ప్లైన్ ఫోన్ నంబర్లను కూడా ప్రకటించినట్లు హైకోర్టుకు తెలిపింది. బాధిత రోగులు 9916302328/080-22200888 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది.
తుమకూరుకు చెందిన న్యాయవాది రమేశ్ ఎల్ నాయక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేఎంసీ ఈ వివరాలు తెలిపింది. ఈ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
కొందరు మెడికల్ ప్రాక్టీషనర్లు, ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ లేని రోగులకు చికిత్స చేయడం లేదని, కొందరు తమ క్లినిక్లను మూసివేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
ఈ నేపథ్యంలో కేఎంసీ తన వద్ద నమోదు చేసుకున్న మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, క్లినిక్లను మూసివేయరాదని తెలిపింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా నాన్ కోవిడ్ పేషెంట్స్కు పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయాలని తెలిపింది.
నాన్ కోవిడ్ పేషెంట్స్కు చికిత్స నిరాకరించరాదని విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
దీంతో హైకోర్టు స్పందిస్తూ, పిటిషనర్ లేవనెత్తిన సమస్య పట్ల కేఎంసీ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొంది.
Updated Date - 2020-08-14T22:15:57+05:30 IST