ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రికి కోవిడ్-19 పాజిటివ్, ఐసొలేషన్కు తరలింపు
ABN, First Publish Date - 2020-04-02T21:43:04+05:30
ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యాకోవ్ లిట్జ్మన్ను ఏకాంతంలోకి తరలించారు.
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యాకోవ్ లిట్జ్మన్ను ఏకాంతంలోకి తరలించారు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో ఆయనను ఐసొలేషన్లో ఉంచడంతోపాటు ఇతర ఉన్నతాధికారులను సెల్ప్ క్వారంటైన్కు పంపించారు.
సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్ళినవారిలో మొస్సద్ చీఫ్ యొస్సి కొహెన్, జాతీయ భద్రతా సలహాదారు మెయిర్ బెన్ షబ్బత్ ఉన్నారు. వీరంతా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.
లిట్జ్మన్ సతీమణికి కూడా కరోనా వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దంపతులిద్దరినీ ఐసొలేషన్లో ఉంచినట్లు, వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. వీరిద్దరికీ వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. గడచిన రెండు వారాల్లో లిట్జ్మన్ను కలిసినవారంతా ఇదే విధంగా ఐసొలేషన్లో ఉండాలని సూచించింది.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇంతకుముందు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం కోవిడ్-19 నెగెటివ్ అని తేలింది.
తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్లో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 6,211. కాగా, 32 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇజ్రాయెలీ యాత్రికుడు ఇటలీలో ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్ వేధింపులు తీవ్రమవుతుండటంతో బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా గుమికూడవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రార్థనలలో కూడా సామూహికంగా పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు మాత్రమే బయటికి వెళ్ళాలని తెలిపింది.
Updated Date - 2020-04-02T21:43:04+05:30 IST