వెనుకకు వెళ్ళేది లేదు : చైనాకు తెగేసి చెప్పిన భారత్
ABN, First Publish Date - 2020-08-06T21:23:56+05:30
తూర్పు లడఖ్లో దళాల ఉపసంహరణపై భారత్, చైనా దళాల కమాండర్లు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లో దళాల ఉపసంహరణపై భారత్, చైనా దళాల కమాండర్లు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వెంబడి వెనుకకు వెళ్ళేది లేదని భారత సైన్యం స్పష్టంగా చెప్పింది. దళాల ఉపసంహరణకు దోహదపడేవిధంగా ఓ కీలకమైన స్థావరాన్ని ఖాళీ చేయాలని భారత సైన్యాన్ని చైనా సైన్యం డిమాండ్ చేసింది. దీనిని భారత సైన్యం తోసిపుచ్చింది.
ఈ ప్రాంతంలోని కొండలలో ప్రత్యేకంగా చేతి వేళ్ల మాదిరిగా కనిపించేవాటిని ఫింగర్స్ అంటారు. ఫింగర్ 8 వద్ద వాస్తవాధీన రేఖ ఉన్నట్లు భారత దేశం చెప్తోంది. అయితే ఫింగర్ 3 వద్ద ధన్ సింగ్ థాపా పోస్ట్ను ఖాళీ చేయాలని భారత సైన్యాన్ని చైనా సైన్యం డిమాండ్ చేసింది. ఈ పోస్ట్ నుంచి భారత సైన్యం వెళ్లిపోతే, తాము వెనుకకు వెళ్తామని చెప్పింది. అయితే ఈ పోస్ట్ భారత భూభాగంలో ఉందని, ఇక్కడి నుంచి వెనుకకు వెళ్ళేది లేదని భారత సైన్యం స్పష్టం చేసింది.
కమాండర్ల స్థాయి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. భారత సైన్యం గతంలో గస్తీ తిరిగే ప్రాంతంలో చైనా దళాలు తిష్ఠ వేశాయి. చైనా దళాలను తిరిగి వెనుకకు వెళ్ళేలా నచ్చజెప్పడానికి మరొకసారి చర్చలు జరగవలసిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది.
పాంగాంగ్ సరస్సు వెంబడి డెప్సాంగ్ ప్లెయిన్స్ రీజియన్, గోగ్రా, ఫింగర్ రీజియన్లలో చైనా దళాలు ఇప్పటికీ ఉన్నాయి. ఫింగర్ 4, 8 మధ్య చైనా తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ పట్టుబడుతోంది. గోగ్రాలో కూడా చైనా దళాల ఉపసంహరణ పూర్తి కాలేదు.
తూర్పు లడఖ్లో చైనా దురాక్రమణ మే 5న ప్రారంభమైంది. జూన్ 15న రాత్రి భారత దళాలపై దాడి చేసి, 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి.
చైనా ఏకపక్ష దురాక్రమణ వల్ల తూర్పు లడఖ్లో ఉత్పన్నమైన పరిస్థితి కొనసాగుతోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిస్థితులనుబట్టి చర్యలు తీసుకోవలసి ఉంటుందని తెలిపింది.
Updated Date - 2020-08-06T21:23:56+05:30 IST