వ్యాక్సిన్ రేసులో భారత్ ముందంజ
ABN, First Publish Date - 2020-11-03T07:10:18+05:30
కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలోని రెండు కంపెనీలు ఇప్పటికే రెండో, మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా...
- ప్రయోగాలు సఫలమవగానే రెండు కంపెనీలకు లైసెన్సులు
- ‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర అధికారి
న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలోని రెండు కంపెనీలు ఇప్పటికే రెండో, మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా.. దిగుమతి చేసుకునే వాక్సిన్ల విభాగంలోనూ ఒక కంపెనీ రెండు, మూడోదశల్లో ఉందని వెల్లడించింది. ప్రయోగ పరీక్షలు సఫలం కాగానే.. కొవిడ్ -19 వ్యాక్సిన్లను అత్యవసర ప్రాతిపదికన పెద్దఎత్తున ఉత్పత్తి చేసి నిల్వ చేసేందుకు రెండు కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే లైసెన్సు ఇచ్చిందని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. పెద్దఎత్తున ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. అందుకే మాటిమాటికీ ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు వ్యాక్సిన్లపై హామీలు ఇస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ప్రయోగాత్మక కరోనా వ్యాక్సిన్లతో మనుషులపై రెండో, మూడో దశ ట్రయల్స్ జరుపుతున్న కంపెనీల్లో పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఉన్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి, నిల్వ కోసం ఈ రెండు కంపెనీలకు లైసెన్సింగ్ లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు అహ్మదాబాద్లోని క్యాడిలా హెల్త్కేర్, హైదరాబాద్లోని బయోలాజికల్-ఈ కూడా వాక్సిన్ల అభివృద్ధిలో మొదటి, రెండో దశల్లో ఉన్నాయి. ‘అత్యవసర’ ప్రాతిపదికన కరోనా చికిత్సకు వాడుతున్న యాంటీ వైరల్ ఔషధం రెమ్డెసివిర్కు ‘పూర్తిస్థాయి మార్కెటింగ్ ధ్రువీకరణ’ ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సమర్పించిన దరఖాస్తును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తిరస్కరించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్ససీవో) పరిధిలోని కొవిడ్-19 విషయ నిపుణుల కమిటీ అక్టోబరు 29న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2020-11-03T07:10:18+05:30 IST