పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్ర మంత్రి వివరణ..
ABN, First Publish Date - 2020-07-12T21:56:12+05:30
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ ..
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు స్పందించారు. ఆరు నెలల్లోగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సిన రాజ్యాంగ విధి కేంద్రానికి ఉందని, ప్రభుత్వం తప్పని సరిగా తన బాధ్యతను నెరవేరుస్తుందని తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉండకపోవచ్చంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా వివరణ ఇచ్చారు.
కరోనా వ్యాప్తి జరక్కుండా పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు మధ్య ఒక సమావేశం కూడా జరిగినట్టు మేఘ్వాల్ తెలిపారు. ఎనిమిదికి పైగా నిబంధనలకు రూపొందించారని, త్వరలోనే వాటిని జారీ చేస్తారని చెప్పారు. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి పలు నిబంధనలు తప్పనిసరని అన్నారు. ఇప్పటికే తగిన సన్నాహకాలు జరుగుతున్నందున త్వరలేనే పార్లమెంటు సమావేశాలు జరగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు.
కాగా, పార్లమెంటు వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు రెండు లేదా మూడో వారంలో వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2020-07-12T21:56:12+05:30 IST