కోవిడ్-19పై ఉత్తర ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి శుభవార్త
ABN, First Publish Date - 2020-04-03T21:15:53+05:30
ఉత్తర ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో గత 48 గంటల్లో కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదు కాలేదని
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్లో గత 48 గంటల్లో కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ సుహాస్ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు 48 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, రెండు రోజుల నుంచి కనీసం ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. ఆరుగురికి నయంకాగా, వారిని ఆసుపత్రి నుంచి పంపించినట్లు తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 2,301కి చేరాయి. 156 మందికి నయమైంది, 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో వివిధ ఆసుపత్రుల్లో చేరిన ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సభ్యులు ఆ ఆసుపత్రిలోని నర్సులపై అక్రమంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిందితులపై జాతీయ భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
జమాత్ సభ్యులను కరోనా వైరస్ చెక్ అప్ కోసం వివిధ ఆసుపత్రులకు తరలించిన సంగతి తెలిసిందే. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రి, నర్సింగ్ సిబ్బందితో ఈ జమాత్ సభ్యులు దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2020-04-03T21:15:53+05:30 IST