‘జనరల్ నరవనే నేపాల్ పర్యటనతో ఇరు దేశాల సైన్యాల మైత్రి వృద్ధి’
ABN, First Publish Date - 2020-11-03T21:45:46+05:30
భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనే నేపాల్ పర్యటన
ఖాట్మండు : భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవనే నేపాల్ పర్యటన మంగళవారం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేపాల్లోని భారత దౌత్య కార్యాలయం అధికార ప్రతినిథి నవీన్ కుమార్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, భారత్, నేపాల్ సైన్యాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న మైత్రీ బంధం మరింత బలపడుతుందన్నారు. ఈ పర్యటన గురించి మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ దౌత్య కార్యాలయం ఈ ట్వీట్ చేసింది.
ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యంపై చర్చించేందుకు జనరల్ నరవనే పర్యటన దోహదపడుతుందని నవీన్ కుమార్ చెప్పారు. పరస్పర ప్రయోజనం కలిగించే మార్గాలను అన్వేషించడానికి, మరింత బలపడటానికి ఉపయోగపడుతుందన్నారు.
జనరల్ నరవనే నేపాల్ పర్యటన నవంబరు 4నుంచి మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను ప్రదానం చేస్తారు.
పీఎం కేపీ శర్మ ఓలీ వైఖరి మారిందా?
భారత దేశంలోని లిపులేఖ్, లింపియధుర, కాలాపానీ ప్రాంతాలు తమవేనని చెప్పుకుంటూ నేపాల్ తన రాజకీయ మ్యాప్ను సవరించిన సంగతి తెలిసిందే. నేపాల్ చర్యతో భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. కృత్రిమంగా భౌగోళిక విస్తరణ జరపడం భారత దేశానికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇదిలావుండగా తాజాగా నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ భారత దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ పాత మ్యాప్నే ఉపయోగించారు. దీనిలో భారత దేశంలోని భూభాగాలు లేవు. దీంతో ఆయన భారత దేశం పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Updated Date - 2020-11-03T21:45:46+05:30 IST