కరోనా సోకిన కార్పొరేటర్ ‘ఘన’కార్యంపై వీడియో వైరల్.. కేసు నమోదు!
ABN, First Publish Date - 2020-06-01T20:09:28+05:30
కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన ఓ కార్పొరేటర్ ఆస్పత్రికి వెళ్లే ముందు తన అభిమానులతో చేసిన హంగామా సోషల్ మీడియాలో...
బెంగళూరు: కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన ఓ కార్పొరేటర్ ఆస్పత్రికి వెళ్లే ముందు తన అభిమానులతో చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనకేదో ఘనకార్యం జరిగినట్టు ఆయన అభివాదం చేస్తుండగా.. అనుచురులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడి నినాదాలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. కరోనా సోకిన విషయం తెలిసి కూడా ఆయన అభిమానుల మధ్యకు వెళ్లడాన్ని సీరియర్గా తీసుకున్న అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదివారం బెంగళూరులోని పాదరాయణపురలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు కార్పరేటర్ను జేడీఎస్ పార్టీ నేతగా గుర్తించారు.
కొవిడ్-19 నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘించిన మరీ సదరు కార్పొరేటర్, ఆయన పరివారం చేసిన నిర్వాకంపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్లతో పాటు, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాదరాయణపుర వార్డు బెంగళూరు కంటైన్మెంట్ జోన్లలో ఒకటిగా ఉండడం గమనార్హం.
Updated Date - 2020-06-01T20:09:28+05:30 IST