అత్యాచారం కేసు: పోలీసుల ముందుకు అనురాగ్ కశ్యప్
ABN, First Publish Date - 2020-10-01T17:04:27+05:30
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇవాళ ముంబై పోలీసుల ముందు..
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇవాళ ముంబై పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ సినీనటి పాయల్ ఘోష్ దాఖలు చేసిన కేసులో పోలీసుల నుంచి నిన్న సమన్లు అందడంతో ఆయన వెర్సోవా పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో కశ్యప్ మరో ఇద్దరు సన్నిహితులతో కలిసి స్టేషన్కు వచ్చారు. అనంతరం కొద్ది సేపటికి ఆయన తరపు లాయర్ కూడా వచ్చారు. సెప్టెంబర్ 22న తన న్యాయవాది నితిన్ సత్పూట్తో కలిసి పాయల్ ఘోష్ వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కశ్యప్పై కేసు నమోదు చేశారు. 2013లో తనపై కశ్యప్ అత్యాచారానికి పాల్పడినట్టు పాయల్ తన ఫిర్యాదులో ఆరోపించింది.
కాగా రెండ్రోజుల క్రితం పాయల్, కేంద్రమంత్రి, ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే మహారాష్ట్ర సీఎం బీఎస్ కోష్యారీని కలిసి కశ్యప్పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. సోమవారం అథవాలేతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పాయల్.. కశ్యప్ను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు అదేరోజు పాయల్తో కలిసి ముంబై జాయింట్ కమిషనర్ విశ్వాస్ నంగరే పాటిల్ను కలిసిన అథవాలే.. బాలీవుడ్ దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజుల్లోగా కశ్యప్ను అరెస్ట్ చేయని పక్షంలో తమ పార్టీ ఆందోళన చేపడుతుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-10-01T17:04:27+05:30 IST