మహారాష్ట్రలో అధిక వర్షపాతం... చెరకు రైతులకు గొప్ప ఉపశమనం...
ABN, First Publish Date - 2020-06-19T00:46:42+05:30
మహారాష్ట్ర అత్యధిక వర్షపాతం విభాగంలోకి రావడానికి కారణం అకాల వర్షాలు
ముంబై : మహారాష్ట్ర అత్యధిక వర్షపాతం విభాగంలోకి రావడానికి కారణం అకాల వర్షాలు, నిసర్గ తుపాను అని ఇండియా మెటియరలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) గురువారం తెలిపింది. ఈ వర్షాలు వ్యవసాయదారులకు ప్రయోజనకరమని పేర్కొంది.
ఐఎండీ అధికారులు గురువారం తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 1 నుంచి 18 వరకు ముంబై, ఎంఎంఆర్ రీజియన్లో అత్యధిక వర్షం కురిసింది.
ముంబై, మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాలతో కూడిన కొంకణ్ సబ్ డివిజన్లో ఇప్పటి వరకు 523 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణంగా ఇదే సమయంలో 317 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ప్రస్తుతం నమోదైన వర్షపాతం సాధారణం కన్నా 65 శాతం ఎక్కువ.
మధ్య మహారాష్ట్రలో ఇదే కాలంలో 164 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇక్కడ 81 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది.
అందుకే ఈసారి అత్యధిక వర్షపాతం విభాగంలోకి మహారాష్ట్ర చేరిందని అధికారులు చెప్పారు. భారీ వర్షపాతం నమోదు కావడం శుభ సూచిక అని తెలిపారు. ఈ ప్రాంతంలో చెరకు, ఇతర పంటల సాగు విస్తారంగా ఉంటుందని, ఈ వర్షాలు రైతులకు ఉపయోగపడతాయని చెప్పారు.
Updated Date - 2020-06-19T00:46:42+05:30 IST