బిహార్ రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
ABN, First Publish Date - 2020-10-21T23:08:36+05:30
బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల
న్యూఢిల్లీ : బిహార్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల తీరును కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) తీవ్రంగా పరిగణించింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు పాటించకపోవడాన్ని గమనించి, బుధవారం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.
ఎన్నికల ప్రచారం నిర్వహించేటపుడు ప్రజలు క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందని తెలిపింది. ఈ నెల 9న జారీ చేసిన మార్గదర్శకాలను మరోసారి ప్రస్తావించింది. నిర్దేశించిన విధంగా ప్రజారోగ్య భద్రతా నిబంధనలు అమలు కావడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించడంతోపాటు, రాజకీయ పార్టీలు తమ కేడర్ అప్రమత్తంగా ప్రవర్తించేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. క్షేత్ర స్థాయిలోని ప్రతినిథులు అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు అమలు చేసే విధంగా సూచనలు జారీ చేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే చర్యలు తీసుకుంటామని ఆగస్టులో హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసింది.
Updated Date - 2020-10-21T23:08:36+05:30 IST