మేకప్ వేసుకోండి.. భర్తలను వేధించకండి.. లాక్డౌన్ వేళ మలేషియా ప్రకటనలు!
ABN, First Publish Date - 2020-04-01T16:54:37+05:30
కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మలేసియా ప్రభుత్వం మహిళలను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలు తీవ్ర ..
కౌలాలంపూర్: కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా మలేషియా ప్రభుత్వం మహిళలను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. ఇళ్లలో ఉన్నప్పుడు మహిళలు అలంకరణ చేసుకోవాలని, భర్తలను వేధించకూడదనీ చెబుతూ ఆన్లైన్లో పలు పోస్టర్లు కనిపించడంతో.. ప్రభుత్వం లింగ వివక్ష, పితృస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 18 నుంచి మలేసియాలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలో గొడవలు రాకుండా ఉండాలంటే పలు సూచనలు పాటించాలని మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది.
ఓ ప్రకటనలో, భర్త సోఫాలో కూర్చుని.. ‘‘ఇంటి పనుల్లో సహాయం కావాలంటే అడగాలి. అంతేకానీ ‘ఎత్తిపొడవద్దు’..’’ అని చెబుతున్నట్టు చిత్రీకరించారు. ‘‘భర్తలను వేధించకండి. డోరేమాన్ యానిమేషన్ క్యారెక్టర్ మాట్లాడినట్టు హాస్యాన్ని జోడించేందుకు ప్రయత్నించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు మంచిగా దస్తులు ధరించి, అలంకరణ చేసుకోండి.. ’’ అని మరో ప్రకటనలో మహిళా వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ ప్రకటనలపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్లను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మలేషియా ప్రభుత్వం దిగివచ్చి మహిళలకు క్షమాపణ చెప్పింది.
Updated Date - 2020-04-01T16:54:37+05:30 IST