అధికార పరిధిని దాటి మరీ ప్రేమజంటను కలిపిన డీసీడబ్ల్యూ!
ABN, First Publish Date - 2020-11-04T01:28:32+05:30
బీహార్కి చెందిన ఓ యువతిని కాపాడి, ఆమె ప్రియుడితో కలిపేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) తన అధికార పరిధిని దాటి మరీ చేయూత ....
న్యూఢిల్లీ: బీహార్కి చెందిన ఓ యువతిని కాపాడి, ఆమె ప్రియుడితో కలిపేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) తన అధికార పరిధిని దాటి మరీ చేయూత అందించింది. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందంటూ సదరు ప్రేమ జంట ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. కమిషన్ చెప్పిన దాని ప్రకారం.. బీహార్కు చెందిన ఓ యువతిని తాను ప్రేమిస్తున్నాననీ, ఉత్తర ప్రదేశ్లోని ఇందిరాపురంలో తాము కాపురం కూడా పెట్టామంటూ ఓ యువకుడు డీసీడబ్ల్యూని ఆశ్రయించాడు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు వారికి తెలియడంతో ఆమెను బలవంతంగా బీహార్ తీసుకెళ్లారనీ.. తనను కూడా తీవ్రంగా కొట్టి గాయపర్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కమిషన్ ఆ యువకుడికి ఫోన్ చేసి వివరాలు తెప్పించుకుంది. అమ్మాయి వివరాలు తెలిసినప్పటికీ ఆమెను ఎక్కడ ఉంచారో తెలియక పోవడంతో డీసీడబ్ల్యూ బీహార్ పోలీసులను రంగంలోకి దించించింది.
దీంతో ఆమె ప్రస్తుతం పెందౌల్లో ఉందనీ.. యువతికి ప్రస్తుతం తీవ్ర ప్రాణ హాని ఉందని పోలీసులు డీసీడబ్ల్యూకి నివేదిక ఇచ్చారు. ఆమెను వేరే ప్రదేశానికి తరలించాలని కూడా పోలీసులు సూచించడంతో.. వెనువెంటనే డీసీడబ్ల్యూ ఆ యువతిని దేశరాజధాని ఢిల్లీకి రప్పించింది. అక్కడే ఆమె కోరుకున్న వాడితో తిరిగి కలిపింది. కాగా ఈ జంటకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ‘‘అమ్మాయిని ఆమె కోరుకున్న వాడితో జతకలిపాం. ఆమెకు తల్లిదండ్రులు, బంధువుల నుంచి తీవ్ర ప్రాణ హాని ఉంది. బీహార్ పోలీసుల సాయంతో మేము వారిని కాపాడాం. ఆమెకు భద్రత కూడా కల్పించాం. ఇందుకోసం మేము మా అధికార పరిధిని సైతం దాటి వెళ్లాము. మానవత్వాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా ఇలాంటి సేవలను కొనసాగిస్తాం..’’ అని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ పేర్కొన్నారు.
Updated Date - 2020-11-04T01:28:32+05:30 IST