కరోనాకు విరుగుడు ప్లాస్మా చికిత్స!
ABN, First Publish Date - 2020-04-12T07:49:15+05:30
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈలోగా ఇన్ఫెక్షన్ సోకిన వారిని రక్షించడానికి అందుబాటులో...
ఇన్ఫెక్షన్ వచ్చి కోలుకున్న వారి రోగ నిరోధక కణాలతో వైద్యం
ఐసీఎంఆర్ నుంచి అనుమతులు వచ్చాయి
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఎస్సీటీఐఎంఎస్టీ డైరెక్టర్ ఆశాకిశోర్
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నెలలు పట్టొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈలోగా ఇన్ఫెక్షన్ సోకిన వారిని రక్షించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగంలోకి తెచ్చేందుకు వైద్య నిపుణులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈకోవలోకే వస్తుంది ‘ప్లాస్మా థెరపీ’. ఈ చికిత్సను అందించడానికి కేరళకు చెందిన శ్రీచిత్ర తిరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(ఎ్ససీటీఐఎంఎ్సటీ)కి భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది. ఇక డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతుల కోసం దరఖాస్తు చేశామని.. అవి రాగానే తమ ప్రయోగాలు ప్రారంభిస్తామని ఎస్సీటీఐఎంఎ్సటీ డైరెక్టర్ డాక్టర్ ఆశాకిశోర్ తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్లాస్మా థెరపీ’కి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు.
- స్పెషల్ డెస్క్
ప్లాస్మా థెరపీ ప్రత్యేకత ఏమిటి?
మన శరీరంలోకి వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశించిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమవుతుంది. తెల్ల రక్త కణాలు ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాను వెంటాడి.. వేటాడి చంపేస్తాయి. దీంతో మనకు వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కరోనాలాంటి వైర్సలను మన రోగనిరోధక వ్యవస్థ అడ్డుకోలేదు. ఇలాంటి సమయాల్లో కరోనా వచ్చి తగ్గిన రోగుల నుంచి రోగనిరోధక కణాలను సేకరించి ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారి శరీరంలోకి చొప్పిస్తే.. వైర్సను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
ఈ చికిత్స అందించేందుకు మీరు సిద్ధమా?
ఆ చికిత్స అందించగలం. ఇందుకోసం ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చింది. డ్రగ్ కంట్రోలర్ అథారిటీ నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉంది.
రోగ నిరోధక కణాల సేకరణ ఎలా?
కరోనా వైరస్ సోకి.. దానిని తట్టుకొని ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరిస్తాం. ఈ రక్తంలోని సీరంను వేరుచేసి దానిలోని రోగనిరోధక కణాలను బయటకు తీస్తాం. అయితే ఎవరి నుంచి పడితే వారి నుంచి రక్తాన్ని సేకరించకూడదు. కరోనా నుంచి కోలుకొని నెగెటివ్ వచ్చిన 28 రోజుల తర్వాత కూడా.. ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని, ఇతర ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తిని ఎంపిక చేసుకుంటాం. అలాంటి వాళ్ల నుంచే రోగ నిరోధక కణాలను సేకరించి రోగి శరీరంలోకి ప్రవేశపెడతాం. ఇలా ప్రవేశపెట్టిన కణాలు రోగి రక్తంలోకి ప్రవేశించి, 3, 4 రోజుల్లోనే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అందరికీ ఈ చికిత్స అందిస్తారా?
ప్రస్తుతానికి కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వాళ్లకే ఈ చికిత్సను అందిస్తాం. ఇవి కేవలం క్లినికల్ ట్రయల్స్ మాత్రమే! అందరికీ ఈ చికిత్సను అందించలేం.
దీనితో సత్ఫలితాలు ఉంటాయా?
ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలు వస్తాయని గతానుభవాలు చెబుతున్నాయి. 2018లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ఈ పద్ధతి మంచి ఫలితాలను ఇచ్చింది.
వ్యాక్సినేషన్తో పోలిస్తే తేడా ఏమిటి?
వ్యాక్సిన్ వేసినప్పుడు మన శరీరం రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సంబంధిత కణాలను విడుదల చేసి, ఆ వైర్సను చంపేస్తుంది. ప్లాస్మా థెరపీలో రోగనిరోధక కణాలు రక్తంలో ఉన్నంత కాలమే రక్షణ ఉంటుంది. ఆపై రోగి శరీరమే ఈ కణాలను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ థెరపీ నేపథ్యం చెప్పండి..
ఈ చికిత్సా పద్ధతిని 1890లో జర్మన్ శాస్త్రవేత్త ఇమిల్వాన్ బెహ్రింగ్ అభివృద్ధిచేశారు. ఇందుకుగానూ ఆయనకు 1901లో నోబెల్ బహుమతి లభించింది. వైద్య రంగంలో తొలి నోబెల్ దక్కింది ఆయనకే.
Updated Date - 2020-04-12T07:49:15+05:30 IST