చైనా మరో దుస్తంత్రం... ఉత్తరాఖండ్వైపు పీఎల్ఏ బెటాలియన్ సంచారం...
ABN, First Publish Date - 2020-08-01T21:04:46+05:30
దురాక్రమణ బుద్ధితో రెచ్చిపోతున్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టినట్లు
న్యూఢిల్లీ : దురాక్రమణ బుద్ధితో రెచ్చిపోతున్న చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టినట్లు ఓ ఆంగ్ల పత్రిక చెప్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ సమీపానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బెటాలియన్ను పంపింది. కొద్ది వారాలుగా లడఖ్ కాకుండా వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో చైనా దళాలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే.
అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండర్ను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలోనూ, లిపులేఖ్ పాస్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి పీఎల్ఏ దళాలు పెరుగుతున్నాయి. లిపులేఖ్ వద్ద సరిహద్దులకు కాస్త దూరంలో దాదాపు 1,000 మంది చైనా సైనికులు ఉన్నారు. దీనినిబట్టి చైనా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు భావించవచ్చు.
మానస సరోవర యాత్రకు వెళ్లే దారిలో లిపులేఖ్ పాస్ ఉంది. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు 80 కిలోమీటర్ల రోడ్డును భారత దేశం నిర్మించింది. ఈ రోడ్డు నిర్మాణంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ రాజకీయ మ్యాపును సవరించి, లిపులేఖ్, లింపియధుర, కాలాపానీలను తమ భూభాగంగా ప్రకటించుకుంది. భారత్-చైనా-నేపాల్ ట్రై జంక్షన్కు సమీపంలో కాలాపానీ ఉంది.
Updated Date - 2020-08-01T21:04:46+05:30 IST