పుకార్ల మీదే కేంద్ర మంత్రి రాజీనామా చేశారా? సంజయ్ రౌత్
ABN, First Publish Date - 2020-09-20T18:39:54+05:30
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు అనేక పుకార్లు సృష్టిస్తున్నాయన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు అనేక పుకార్లు సృష్టిస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఆదివారం కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ అంటున్నారని, కేవలం పుకార్ల ఆధారంగానే అకాలీదళ్కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? చెప్పాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళనపై పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లులతో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండదని కేంద్రం ప్రకటించిందని, ఒకవేళ అదే గనక నిజమైతే చాలా సంతోషించాల్సిన పరిణామమని ఆయన అన్నారు. ఈ వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోరన్న ధీమాను కేంద్రం ఇవ్వగలదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
Updated Date - 2020-09-20T18:39:54+05:30 IST