అధినేత బీజేపీ వైపు.. ఎమ్మెల్యేలు రైతుల వైపు.. ఆ పార్టీలో పరిస్థితి చిత్రం
ABN, First Publish Date - 2020-12-11T17:46:33+05:30
బీజేపీ మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా
న్యూఢిల్లీ : బీజేపీ మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా రైతుల విషయంలో కేంద్రానికి మద్దతుగా ఉంటే, ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నారు. దీంతో పార్టీ తీవ్ర గందరగోళంలో మునిగిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న మొదటి రోజు నుంచీ దుష్యంత్ పై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి. బీజేపీ నుంచి బయటికి వచ్చి, రైతుల ఉద్యమంలో పాలు పంచుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. మొదట్లో దుష్యంత్ కాస్త... ఆలోచనలో పడినా, తర్వాత బీజేపీకి మద్దతుగానే నిలుస్తూ వస్తున్నారు.
తాజాగా కూడా ఆయన కేంద్రానికి మద్దతుగానే మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నంత వరకూ కనీస మద్దతు ధర అనే కవచం రైతులకు ఉండేలా కృషి చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అలా సాధ్యం కాని పక్షంలో తానే బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర తప్పకుండా హామీ ఇవ్వాలని తమ పార్టీ అధినేత ఇప్పటికే డిమాండ్ చేశారని, కేంద్రం పంపిన రాత పూర్వక హామీల్లో ఈ విషయం కూడా ఉందని దుష్యంత్ గుర్తు చేశారు. రైతుల విషయంలో తాను ప్రతిరోజూ కేంద్ర ప్రభుత్వంతో టచ్లోనే ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘మొదట నేను రైతును. వివిధ పంటలకు తగిన ధరలుండేలా చూడటం నా కనీస బాధ్యత. కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ఇప్పటికే లిఖిత పూర్వకంగా ఇచ్చింది. ఇక రైతులే నిర్ణయించుకోవాలి.’’ అని చౌతాలా పేర్కొన్నారు. అయితే పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు. అమర్జీత్ దండా, జోగి రామ్సింగ్, ఈశ్వర్ సింగ్, రామ్ కుమార్ గౌతమ్, రామ్ కరణ్ కాలా అనే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం చట్టాలను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2020-12-11T17:46:33+05:30 IST