బంగారం అక్రమ రవాణా కోసం కేరళ ప్రభుత్వ వాహనాలు : బీజేపీ
ABN, First Publish Date - 2020-10-31T23:27:16+05:30
బంగారం అక్రమ రవాణా కోసం ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారని
తిరువనంతపురం : బంగారం అక్రమ రవాణా కోసం ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. కేరళలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వ వాహనాలను, క్రీడా మండలి ప్రెసిడెంట్ కారును ఉపయోగించారని ఆరోపించింది. చాలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అనేక విధాలుగా ఈ దందాకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. కేరళ క్రికెట్ అసోసియేషన్కు బినామీ ఆస్తులు ఉన్నాయని, హవాలా లావాదేవీలు నడుపుతోందని ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపింది.
బీజేపీ కేరళ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ, నేరస్థులకు రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలు సహకరిస్తున్నాయన్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వాటి వాహనాలను బంగారం అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారన్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కారును కూడా దీని కోసం వినియోగించారన్నారు. కేరళ క్రికెట్ అసోసియేషన్కు బినామీ ఆస్తులు ఉన్నాయని, హవాలా లావాదేవీలు నడుపుతోందని ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి వద్ద మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం శివశంకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనను దాదాపు 6 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది.
Updated Date - 2020-10-31T23:27:16+05:30 IST