రామమందిరం కోసం 28 ఏళ్లు బ్రహ్మచర్యం.... ఇప్పుడు రామునికే జీవితం అంకితం!
ABN, First Publish Date - 2020-08-05T17:46:06+05:30
భోపాల్కు చెందిన కరసేవకుడు రవీంద్ర గుప్తా 28 సంవత్సరాల క్రితం రామాలయ నిర్మాణాన్నికాంక్షిస్తూ, కఠిన నిర్ణయం తీసుకున్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యేంత వరకూ పెళ్లి చేసుకోకూడదని...
భోపాల్: భోపాల్కు చెందిన కరసేవకుడు రవీంద్ర గుప్తా 28 సంవత్సరాల క్రితం రామాలయ నిర్మాణాన్నికాంక్షిస్తూ, కఠిన నిర్ణయం తీసుకున్నారు. రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యేంత వరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు రవీంద్ర వయసు 50 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆయన వివాహం గురించి ఆలోచించడం లేదు. భోపాల్లోని లఖేరాపుర నివాసి రవీంద్ర గుప్తాను భోజ్పాలి బాబా అని కూడా పిలుస్తారు. అతను ఇప్పటివరకు నాలుగుసార్లు నర్మద ప్రదక్షిణ చేశారు. రవీంద్ర గుప్తా 22 సంవత్సరాల వయసులో అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం రవీంద్ర గుప్తా బేతుల్లో ఉంటున్నారు. రామాలయ భూమి పూజ సందర్భంగా రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ తాను ఆగస్టు 5న శ్రీరామునికి పూజ చేస్తానని తెలిపారు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతున్నది కదా... ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని మీడియా అడగగా, ఇకపై తన జీవితమంతా శ్రీరాముడు, తల్లి నర్మద పూజల కోసమే కేటాయిస్తానని అన్నారు. తాను 1992లో కరసేవ కోసం వెళ్లినప్పుడు తనకు 22 సంవత్సరాలని రవీంద్ర గుప్తా తెలిపారు. తాను రామాలయం నిర్మితమయ్యేంత వరకు వివాహం చేసుకోనని కుటుంబ సభ్యులకు తెలిపానన్నారు. ఇప్పుడు రామాలయ నిర్మాణం ప్రారంభం కావడంతో చాలా సంతోషం కలుగుతున్నదన్నారు.
Updated Date - 2020-08-05T17:46:06+05:30 IST