భారత్, చైనా సైన్యాలు.. గాల్లో 200 రౌండ్ల కాల్పులు!
ABN, First Publish Date - 2020-09-16T18:01:35+05:30
సరిహద్దు వద్ద ప్రతిష్టంభన తొలగించేందుకు భారత్ చైనా రక్షణ మంత్రులు మాస్కోలో ఓ అంగీకారానికి రాక మునుపు ఇరు దేశాల సైన్యం మధ్య లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు సమాచారం. పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 3,4 శిఖరాలు కలిసే ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాలు అవతలి సైన్యాన్ని హెచ్చరిచేందుకు గాల్లో ఏకంగా 200 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిసింది.
లద్దాఖ్: సరిహద్దు వద్ద ప్రతిష్టంభన తొలగించేందుకు భారత్ చైనా రక్షణ మంత్రులు మాస్కోలో ఓ అంగీకారానికి రాక మునుపు ఇరు దేశాల సైన్యం మధ్య లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు సమాచారం. పాంగాంగ్ సరస్సు వద్ద ఫింగర్ 3,4 శిఖరాలు కలిసే ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాలు అవతలి సైన్యాన్ని హెచ్చరిచేందుకు గాల్లో ఏకంగా 200 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలిసింది.
సరస్సు ఉత్తర తీరంలోని శిఖర ప్రాంతాలపై(ఫింగర్లు) ఆధిపత్యం కోసం ఇరు సైన్యాలు ప్రయత్నిస్తున్న సందర్భంగా ఈ ఘటన జరిగిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి తెలిపారు. ఒకరికొకరు ఎదురపడే క్రమంలో రెండు దేశాల సైన్యాలు హెచ్చరికగా గాల్లో కాల్పులు జరిపాయని సదరు అధికారి తెలిపారు.
అంతకుమనుపు.. సెప్టెంబర్ 7న చుషుల్ సెక్టర్లో ఇరు సైన్యాలు హెచ్చరికగా చేసిన కాల్పుల కంటే ఈ ఘటన తీవ్రమైనదని సదరు అధికారి తెలిపారు. దీంతో 45 ఏళ్ల తరువాత తూర్పు లద్దాఖ్ ప్రాంతం కాల్పుల శబ్దాలతో మారుమోగిందని మిలిటరీ వర్గాలు వ్యాఖ్యానించాయి. అయితే.. చుషుల్ సెక్టర్ ఘటనపై ఇరు దేశాలు అప్పటికే ఓ ప్రకటన విడుదల చేశాయి. కానీ ఫింగర్ 3,4 వద్ద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ భారత్ చైనా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
Updated Date - 2020-09-16T18:01:35+05:30 IST