అసోం వరదల్లో ఐదుగురి మృతి, భారీగా పంట నష్టం
ABN, First Publish Date - 2020-05-30T12:30:18+05:30
అసోం రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది.....
గువహటి (అసోం): అసోం రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. అసోం రాష్ట్రంలోని నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో 7 జిల్లాలు ముంపునకు గురయ్యాయి. గోల్ పర లఖీపూర్, హోజోయ్ లోని దోబోకా ప్రాంతాల్లో మరో ఇద్దరు వరదనీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. 11 రెవెన్యూ సర్కిళ్లలోని 356 గ్రామాలు వరదనీటిలో మునిగిపోవడంతో 3.81 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నలబరి, గోల్ పరర, నాగాం, హోజోయ్, వెస్ట్ కర్బీ అంగ్ లాంగ్, దిబ్రూఘడ్, తిన్ సుకియా జిల్లాలు వరద ముంపు బారిన పడ్డాయి. వరద బాధితులను 190 సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు. అసోం రాష్ట్రంలో వరదల వల్ల 24,755 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.వేలాది ఇళ్లు వరదల వల్ల దెబ్బతిన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 3,880 మందిని కాపాడారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరదబాధితులకు ఆహారం, మంచినీళ్లు, మందులు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Updated Date - 2020-05-30T12:30:18+05:30 IST