షాకింగ్: వేగంగా మాయమవుతున్న యాంటీబాడీలు!
ABN, First Publish Date - 2020-12-09T01:41:27+05:30
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు త్వరగా మాయమైపోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు త్వరగా మాయమైపోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్ నుంచి కోలుకున్న 250 మందికిపైగా రోగులపై 5 నెలలపాటు నిర్వహించిన అధ్యయనం అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్ ఇమ్యునాలజీ’ అనే అనే జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనాతో ఆసుపత్రి పాలైన 79 మంది రోగులు, 175 మంది ఔట్ పేషెంట్లు, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించని వారి నుంచి సేకరించిన 983 బ్లడ్ ప్లాస్మా నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కథరినా రోల్ట్జెన్ మాట్లాడుతూ.. ఇమ్యునోగ్లోబ్లిన్ జి ప్రతిరోధకాలు దీర్ఘకాలం మనగలుగుతాయని, అయితే తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిలో తొలుత రోగనిరోధకశక్తి ప్రతిస్పందనలు బాగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా క్షీణిస్తాయన్నారు.
కరోనా వైరస్ను తటస్థం చేసే వివిధ రకాల యాంటీబాడీ స్థాయులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత దాదాపు మొదటి నెల నుంచే క్షీణించడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యం బారినపడిన రోగులతో పోలిస్తే తేలికపాటి అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో వైరల్ స్పైక్ ప్రోటీన్ కాంప్లెక్స్కు ప్రతిస్పందించే యాంటీబాడీలు అధిక నిష్పత్తిలో ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Updated Date - 2020-12-09T01:41:27+05:30 IST