పారదర్శక పన్ను విధానాన్ని ప్రకటించినందుకు మోదీకి అమిత్ షా, రాజ్నాథ్ ప్రశంసలు
ABN, First Publish Date - 2020-08-13T20:30:43+05:30
పన్ను చెల్లింపు కోసం పారదర్శక విధానాన్ని ప్రారంభించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపు కోసం పారదర్శక విధానాన్ని ప్రారంభించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను గౌరవించేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు.
అమిత్ షా గురువారం ఇచ్చిన ట్వీట్లో, నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు భారత దేశ ప్రగతి, అభివృద్ధికి వెన్నెముక వంటివారని తెలిపారు. అలాంటి నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను సాధికారులను చేయడంతోపాటు గౌరవించేందుకు మోదీ ప్రభుత్వం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు కల్పించిన ఈ వేదిక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టిగా ఆకాంక్షిస్తున్న ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన’ దిశగా మరొక ముందడుగు అని తెలిపారు.
రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్లో, మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లింపు సులువవుతుందని, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను ప్రోత్సహించేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విధానాన్ని పాటించడం సులువయ్యే విధంగా చేస్తున్నారని తెలిపారు. పారదర్శక పన్ను విధానానికి ప్లాట్ఫారంను ప్రారంభించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల కష్టాలు తగ్గేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ‘‘ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ - ఆనరింగ్ ద ఆనెస్ట్’’ ప్లాట్ఫారాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ పన్ను విధానం ఫేస్లెస్ కాబోతోందని, ఇది పన్ను చెల్లింపుదారులకు న్యాయంగా, నిర్భయంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగిస్తుందని చెప్పారు.
Updated Date - 2020-08-13T20:30:43+05:30 IST