ఆందోళన వద్దు... ప్రతి ఒక్కరికీ ఇస్తాం : ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2020-10-29T18:55:25+05:30
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేస్తామని ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటనకు ప్రాధాన్యం లభించింది. ‘‘వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే... ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. ఎవర్నీ మరిచిపోం అని హామీ ఇస్తున్నా.’’ అని మోదీ ప్రకటించారు. అయితే మొదట్లో మాత్రం కోవిడ్ వారియర్స్ పైనే సహజంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో ‘జాతీయ నిపుణుల బృందం’ ఏర్పాటైందని, వారు ఓ ప్రాధమ్యాన్ని నిర్దేశిస్తారని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ ను నిల్వచేయడానికి 28,000 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండల స్థాయిల్లో అంకిత భావంతో ఉన్న కార్యకర్తల బృందం ఉందని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వారు ఆ పనిని నిర్వర్తిస్తారని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో నిపుణుల బృందం అధికారులకు తగిన సూచనలు ఇస్తుందని, ప్రతి వ్యక్తికీ అందేలా వ్యూహం రచించడంలో అధికారులకు ఈ బృందం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ తెలిపారు.
Updated Date - 2020-10-29T18:55:25+05:30 IST