ఆగ్రా జిల్లాలో మిడతల దండు దాడి...వ్యవసాయాధికారుల అలెర్ట్
ABN, First Publish Date - 2020-05-23T13:32:09+05:30
ఆగ్రా జిల్లాలోని వ్యవసాయ పంటలపై మిడతల దండు దాడి చేయడంతో వ్యవసాయాధికారులు అప్రమత్తమయ్యారు....
ఆగ్రా : ఆగ్రా జిల్లాలోని వ్యవసాయ పంటలపై మిడతల దండు దాడి చేయడంతో వ్యవసాయాధికారులు అప్రమత్తమయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి వస్తున్న మిడతల దండు దాడి ఆగ్రా జిల్లా పొలాలకు వ్యాపించడంతో వ్యవసాయాధికారులు రైతులను అప్రమత్తం చేశారు. పాక్ సరిహద్దుల్లోని రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఆగ్రాలోకి మిడతలు అడుగుపెట్టాయి. మిడతల దండును నివారించేందుకు రైతులు పొలాల్లో డ్రమ్స్ మోగించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. పొలాల్లో పొగ పెడితే మిడతలు పారిపోతాయని ఆగ్రా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాంప్రవేష్ చెప్పారు. తమ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 50 ట్రాక్టర్లు, మూడు అగ్నిమాపకశాఖ వాహనాలతో పురుగు నివారణ మందులను స్ప్రేయింగ్ చేస్తున్నామని ఆగ్రా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. అసలే కరోనా వైరస్ సంక్షోభంతో అల్లాడుతున్న రైతులకు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’ మిడతల దండు దాడి చేస్తోంది. పాక్ నుంచి మిడతల దండు దాడిని నివారించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
Updated Date - 2020-05-23T13:32:09+05:30 IST