రేషన్ కోసం ఆశగా పసివాణ్ణి ఎత్తుకుని 13 కిలోమీటర్లు నడిచి....
ABN, First Publish Date - 2020-05-09T17:14:07+05:30
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పేదల బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. జీవనోపాధి కోల్పోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు.
మాల్దా: కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా పేదల బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. జీవనోపాధి కోల్పోవడంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక వేదనాభరిత ఉదంతం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా పరిధిలోని బనియాపుకుర్ గ్రామానికి చెందిన మార్గరెట్ హన్స్దాకు చేదు అనుభవం ఎదురయ్యింది. మార్గరెట్ తన 6 నెలల శిశువును ఎత్తుకుని, 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్లాక్ ఆఫీస్కు రేషన్ కోసం నడుచుకుంటూ వెళ్లింది. ఆమె భర్త చందన్ బెంగళూరులో కూలీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. ఈ సందర్భంగా మార్గరెట్ మాట్లాడుతూ ... నేను నా తిండి గురించి పట్టించుకోకపోయినా, రోజుకు రెండుసార్లు నా బిడ్డల కడుపు నింపాలి. అందుకే ఆందోళన చెందుతున్నాను. నా బిడ్డకు 6 నెలలు. నాకు మరో మూడున్నర ఏళ్ల అమ్మాయి, ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తిండికి ఇబ్బందులు పడుతున్నాం. పైగా మాకు రేషన్ కార్డు కూడా లేదని మార్గరెట్ తెలిపింది. ఆమె సమస్యను తెలుసుకున్నసంబంధిత అధికారి హర్ధన్ దేవ్ ఆమెకు రేషన్ కిట్ అందించారు.
Updated Date - 2020-05-09T17:14:07+05:30 IST