67 ఏళ్ల తర్వాత.. అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష!
ABN, First Publish Date - 2020-10-19T06:30:19+05:30
సరిగ్గా 67 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం ఓ మహిళకు మరణశిక్షను అమలు చేయబోతోంది.
వాషింగ్టన్, అక్టోబరు 18: సరిగ్గా 67 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం ఓ మహిళకు మరణశిక్షను అమలు చేయబోతోంది. లిసా మోంట్గోమెరీ అనే మహిళకు డిసెంబరు 8న విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ శిక్షను అమలు చేయనుంది. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శుక్రవారం ప్రకటించింది.
చివరిసారిగా 1953 డిసెంబరు 18న బోనీ బ్రౌన్హెడీ అనే మహిళ అపహరణ, హత్య కేసుల్లో మరణశిక్షను అమలు చేశారు. 2004లో ఓ ఎనిమిది నెలల గర్భిణిని గొంతుపిసికి చంపి, ఆమె కడుపు కోసి.. గర్భంలోని శిశువును ఎత్తుకెళ్లిందన్న కేసులో లిసా మోంటిగోమెరీకి కోర్టు 2008లో మరణశిక్ష విధించింది.
కానీ, అమెరికాలో 2003 నుంచే మరణశిక్ష అమలుకావడం లేదు. మరణశిక్షల అమలును కొనసాగించాలని అక్కడి ఫెడరల్ ప్రభుత్వం గత జూలైలో నిర్ణయించింది.
Updated Date - 2020-10-19T06:30:19+05:30 IST