మేనికి మెరుపు
ABN, First Publish Date - 2020-05-09T17:23:23+05:30
జుట్టుకు మాస్క్లా పెరుగునీ ఉపయోగించవచ్చు. పెరుగుని జుట్టుకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
ఆంధ్రజ్యోతి(09-05-2020)
జుట్టుకు మాస్క్లా పెరుగునీ ఉపయోగించవచ్చు. పెరుగుని జుట్టుకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
ఓవైపు లాక్డౌన్... మరోవైపు ఎండలు! అంతా బాగుంటే కనీసం రెండుసార్లయినా బ్యూటీపార్లర్కు వెళ్లేవారు. ఐ బ్రోస్, ఫేషియల్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్... ఇలా లిస్ట్ పెద్దగానే ఉండేది. కానీ లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైపోయారు. అయితేనేం... కొంచెం మనసు పెడితే ఇంట్లో లభించే వస్తువులతోనే మేనికి మెరుగులు దిద్దుకోవచ్చు. అదెలా అంటే...
స్త్రీలలో దట్టమైన కనుబొమలు, పైపెదవి మీద వచ్చే అవాంఛిత రోమాలు ఇబ్బందికి గురిచేస్తాయి. అయితే ఇంట్లోనే ఈ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఐ బ్రోస్ పెరిగినట్టయితే ట్వీజర్స్తో నెమ్మదిగా తీసేయాలి. ఐ బ్రో లైన్ దెబ్బతినకుండా జాగ్రత్తగా హెయిర్ను తీయాలి. ఒకవైపు నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్లాలి. అవాంఛిత రోమాలను ఫేషియల్ బ్లేడ్తో తొలగించుకోవచ్చు. ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన రేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
వ్యాక్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బ్యూటీ ఉత్పత్తులు అమ్మే షాపులలో వ్యాక్స్ లభిస్తాయి. కొన్నిచోట్ల ఇంకా దుకాణాలు తెరవడం లేదు కాబట్టి ఇంట్లోనే వ్యాక్స్ తయారుచేసుకోండి. పంచదార, తేనె, నిమ్మరసం కలిపి వేడి చేయండి. పంచదార కరిగి, మిశ్రమం చిక్కగా అయ్యాక దింపుకోండి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులకు వ్యాక్స్గా ఉపయోగించవచ్చు.
ఇంట్లో ఫేషియల్గా పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్ప్యాక్లా చేసుకుంటే సరిపోతుంది. పసుపులో రోజ్ వాటర్ కలిపి కూడా ట్రై చేయవచ్చు.
ఓట్స్, తేనె, ఆలివ్ ఆయిల్ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో చర్మం నిగారింపు కోల్పోకుండా ఉంటుంది.
ఒక టబ్లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి కాళ్లు పెట్టాలి. పాదాల సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది.
సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్లా వేయాలి. పదినిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ను చేతులకు కూడా వేసుకోవచ్చు.
జుట్టు సంరక్షణ కోసం ముందుగా కొద్ది వేడినూనెతో తలపై మర్దన చేయాలి. తరువాత టవల్ చుట్టి పావుగంట పాటు వదిలేయాలి. తరువాత షాంపూ, కండిషనర్ ఉపయోగించాలి. జుట్టుకు మాస్క్లా పెరుగునూ ఉపయోగించవచ్చు. పెరుగును జుట్టుకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
Updated Date - 2020-05-09T17:23:23+05:30 IST