100 మంది నకిలీ ప్రొఫెసర్లు! గుట్టు రట్టుచేసిన జేఎన్టీయూ
ABN, First Publish Date - 2020-01-14T16:10:14+05:30
జేఎన్టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో సుమారు 100 మంది నకిలీ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు తేలింది. వారంతా నకిలీ పీహెచ్డీలతో ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. నకిలీ
త్వరలో కఠిన చర్యలకు సన్నద్ధం
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో సుమారు 100 మంది నకిలీ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు తేలింది. వారంతా నకిలీ పీహెచ్డీలతో ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. నకిలీ ప్రొఫెసర్లపై పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందడంతో.. జేఎన్టీయూ విచారణ చేపట్టింది. గడిచిన 15 రోజుల్లో మొత్తం 320 మంది ప్రొఫెసర్ల పీహెచ్డీ పట్టాలను పరిశీలించింది. వీటిల్లో సుమారు 100 నకిలీవని తేల్చింది. నకిలీ ప్రొఫెసర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది.
అయితే.. ఈ నకిలీ ప్రొఫెసర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యముందనే వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ పీహెచ్డీల అంశం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నా.. అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అప్పట్లోనే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉంటే.. పరిస్థితి ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కాగా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీలే కేంద్రంగా నకిలీ పీహెచ్డీ పట్టాల దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా జేఎన్టీయూ గుర్తించిన నకిలీ పీహెచ్డీల్లో అత్యధికం ఆ కోవలోనివే. తరగతులకు హాజరు కాకుండానే.. ఎలాంటి థీసిస్ సమర్పించకుండానే ఆ వర్సిటీలు పట్టాలు జారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు ప్రొఫెసర్లు బీటెక్ చదవకుండానే.. ఎంటెక్ సర్టిఫికెట్లు సంపాదించడం గమనార్హం.
Updated Date - 2020-01-14T16:10:14+05:30 IST