మార్చిలో ఫీజుల నిర్ధారణ
ABN, First Publish Date - 2020-01-31T15:44:58+05:30
ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులను మార్చి నెలాఖరు కల్లా నిర్ధారిస్తామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్
స్కూళ్లను, జూనియర్ కాలేజీలను కేటగిరీలుగా చేసి నివేదిస్తాం: చైర్మన్
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులను మార్చి నెలాఖరు కల్లా నిర్ధారిస్తామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలను కేటగిరీలుగా చేసి ఫీజులను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. తమ కమిషన్లోని పది మంది సభ్యులు అన్ని పాఠశాలలను, కాలేజీలకు వెళ్లి తనిఖీ చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 20 మంది అధికారులు, పాలనా సిబ్బందిని పంపించాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్ను కోరతామని ఆయన తెలిపారు. తనిఖీలను కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు.
గురువారం విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని తన కార్యాలయంలో కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయశారదారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై ఇటీవల దౌర్జన్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నేరాలు, వాటికి శిక్షలను పాఠ్యాంశాల్లో చేర్చేలా విద్యాశాఖకు సిఫారసు చేస్తామని వివరించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో టీచర్ల లైంగిక వేధింపులకు సంబంధించిన విచారణలు నెలరోజుల్లో తేల్చి తుది నివేదికను ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకూ జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను తాము పర్యవేక్షిస్తామన్నారు. ఇక పాఠశాలల్లో పర్యవేక్షణ ఉండటం లేదని తమ దృష్టికి వచ్చిందని చెబుతూ... క్రమానుగతంగా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టేలా పాఠశాల విద్యా కమిషనర్కు సిఫారసు చేస్తామన్నారు.
Updated Date - 2020-01-31T15:44:58+05:30 IST