ఆదివాసులు– ‘ఆన్లైన్ బోధన’
ABN, First Publish Date - 2020-07-25T06:03:45+05:30
విద్య ప్రాముఖ్యతను ఆదివాసి సమాజం ఈ మధ్యకాలంలోనే తెలుసుకోగలిగింది. తరతరాలుగా ఆర్ధిక, రాజకీయ, సామాజిక వివక్షకు గురైన ఆదివాసీ సమాజానికి గిరిజన సంక్షేమ....
విద్య ప్రాముఖ్యతను ఆదివాసి సమాజం ఈ మధ్యకాలంలోనే తెలుసుకోగలిగింది. తరతరాలుగా ఆర్ధిక, రాజకీయ, సామాజిక వివక్షకు గురైన ఆదివాసీ సమాజానికి గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలు చేయూతనిచ్చాయి. డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ బోధనలు పేదరికంలో ఉన్న ఆదివాసీ విద్యార్థులకు ఉపకరించదు. బాల్యదశలో తరగతి విద్యా బోధన అనుభూతి పూర్తి భిన్నమైనది. అటువంటి విద్యను ఈ ఆన్లైన్ బోధన దూరం చేస్తుంది. ఆదివాసీలు ఒక చిన్న గదిలో లేదా గుడిసెలో ఉమ్మడిగా, కుటుంబాలతో జీవిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతలు, సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆన్లైన్ అనేది విద్యార్థులను మభ్యపెట్టే ఆలోచనే. ఇది అణగారిన వర్గాలకు చెడు చేయడం, అగ్రవర్గాల వారికి మేలు చేయడమే. ఫైనాన్స్ మినిస్టర్ మే 17వ తేదీన మానవ వనరుల అభివృద్ధి శాఖ సహకారంతో ఇంటర్నెట్ కనెక్షన్, కంప్యూటర్ సామర్ధ్యం లేని వారికి, ఆన్లైన్ బోధన కొరకు 12 కొత్త ఛానెల్స్ ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రకటించారు. మరి టీవీ సౌకర్యం లేని పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటి? తరగతి విద్యా బోధనకి ఆన్లైన్కు ఎంతో తేడా ఉంటుంది. తోటి విద్యార్థులతో ఆటలు ఆడడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో మానసిక ఎదుగుదల, సోదర భావం పెరుగుతుంది. వాటన్నింటినీ ఆన్లైన్ ద్వారా బోధించలేము. యునెస్కో సర్వే ప్రకారం 43% శాతం టీచర్లు ఆన్లైన్ బోధన దీర్ఘకాలంలో పనిచేయదని, 28% శాతం టీచర్లు ఈ విద్య ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమతమవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఎదగడానికి తరగతి విద్యా బోధన అవసరం. అది మానవ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇక, కేవలం మధ్యాహ్న భోజన పధకం కొరకు స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పరిస్థితి ఏమిటి ? ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కలగజేస్తుంది? గ్రామాలలో ఉన్నటు వంటి అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, గ్రామ పంచాయితీలు, తాలూకా హెడ్క్వార్టర్స్కు ఇంటర్నెట్ కనెక్షన్, టీ.వీ కంప్యూటర్ సదుపాయాలను కల్పించి విద్యా బోధన చేసినట్లయితే కొంతవరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
– డాక్టర్ సునీత భూక్యా
Updated Date - 2020-07-25T06:03:45+05:30 IST