అక్షర బద్ధుడు
ABN, First Publish Date - 2020-02-16T06:27:33+05:30
రాయడమే తప్ప... బతకడం తెలీని బడుగు జర్నలిస్టు. అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి.. సగటు మధ్యతరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే!...
పసుపులేటి రామారావు (1950– 2020)
88 ఏళ్ళ తెలుగు సినీచరిత్రలో 50 ఏళ్ళు మరోవైపు చూపు లేకుండా, నిరంతరాయంగా రాస్తూ, సినిమాతో కలసి నడచిన అరుదైన సినీజర్నలిస్టు పసుపులేటి రామారావు. చివరి వరకు అదే పసితనపు ఉత్సాహం, అంతే నిబద్ధత. ఉదయాన్నే ఏడు గంటల కల్లా సైకిలెక్కి, స్టూడియో రౌండప్, సినిమా ఆఫీసుల విజిట్లతో... నట, దర్శక, నిర్మాతలతో మాట్లాడుతూ... సమాచారం, స్టిల్స్ సేకరిస్తూ... ఇంటర్వ్యూలు చేసేస్తూ... రాత్రి దాకా కష్టపడడం... ఒంటి చేతితో సంచిక మొత్తం వార్తలు రాసేయడం– అదీ ఆయన తత్త్వం.
రాయడమే తప్ప... బతకడం తెలీని బడుగు జర్నలిస్టు. అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి.. సగటు మధ్యతరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికో పొద్దున్నే తలుపు తెరిచే టైమ్కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ... ‘ఆంధ్రప్రభ’లూ... ‘ఆంధ్ర జ్యోతు’లూ చదివిన రోజుల నుంచీ... బెజవాడలో ఏ సినిమా హాలు దగ్గరో గంటకు పావలా పెట్టి ‘జ్యోతి చిత్ర’లూ, ‘సితార’లూ, ‘శివరంజను’లూ ఆబగా తిరగేసిన రోజుల నుంచీ నా లాంటి వేలమంది సినిమా పిచ్చోళ్ళకు ఆయన పేరు తెలుసు!
పాతికేళ్ళ క్రితం మద్రాసులో ఏ సినిమా ప్రెస్మీట్కు వెళ్ళినా... అర్జునరావు... జగన్... ఉమామహేశ్వరరావు... ‘ట్రేడ్ గైడ్’ వెంకటేశ్వరరావు... జగన్మోహనరావు... పాటిబండ్ల విజయలక్ష్మి... వ్యాస్చంద్... బి.కె. ఈశ్వర్... ఎం.ఎల్.నరసింహం... నారాయణవర్మ... బి. జయ-బిఏ రాజు.. ఇలా ఎంతోమంది! వాళ్ళందరితో ఉంటూనే... అందరికీ కాస్తంత భిన్నంగా... తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా... తలకు రుమాలు... చంకకు గుడ్డ సంచీ... సైకిలు (తరువాత ఎప్పటికో టీవీఎస్ ఫిఫ్టీ)... సీరియస్గా... ముందు వరుసలో వంచిన తల ఎత్తకుండా, కాగితం మీద పెన్ను ఆపకుండా... పెద్ద అక్షరాల కలిపిరాతతో రాసుకుంటూ పోతూ ఉండే సాదాసీదా మనిషి పసుపులేటి రామారావు! చివరి వరకు అదే పసితనపు ఉత్సాహం, అంతే నిబద్ధత. ఉదయాన్నే ఏడు గంటల కల్లా సైకిలెక్కి, స్టూడియో రౌండప్, - సినిమా ఆఫీసుల విజిట్లతో... నట, దర్శక, నిర్మాతలతో మాట్లాడుతూ... సమాచారం, స్టిల్స్ సేకరిస్తూ... ఇంటర్వ్యూలు చేసేస్తూ... రాత్రి దాకా కష్టపడడం... ఒంటి చేతితో సంచిక మొత్తం వార్తలు రాసేయడం– అదీ ఆయన తత్త్వం. ‘విశాలాంధ్ర’, ‘జ్యోతిచిత్ర’ రోజుల నుంచి ‘సంతోషం’ మ్యాగజైన్ దాకా అదే పద్ధతి!!
ఇరవై ఏళ్ళకే 1970లో బతుకుదెరువు వెతుక్కుంటూ మద్రాసు చేరిన రామారావు ‘మిక్కీ మౌస్’, ‘బాలభారతి’ లాంటి పిల్లల పత్రికల్లో కొన్నాళ్లు... ఆపైన కమ్యూనిజం ఉత్సాహంతో ‘విశాలాంధ్ర’లో కొన్నేళ్ళు పనిచేశారు. ‘సోవియట్ భూమి’ శ్రీకాంత్ ఆదరణతో నిలబడ్డారు. ‘విశాలాంధ్ర’లో వంద రూపాయల జీతం. పెళ్ళి కాని జీవితం. రామారావు సిన్సియారిటీ చూసి, జర్నలిస్టు మోహన్ కుమార్ సాక్షాత్తూ ‘జ్యోతిచిత్ర’ లాంటి పెద్ద పత్రికలో చేరమని ఆఫర్ చేస్తే, ‘పెట్టుబడి దారుల పేపరులోనా’ అంటూ తటపటాయించిన సత్తెకాలపు మనిషి ఆయన. చివరకు ‘ఆంధ్రజ్యోతి’ గ్రూపులో చేరి, సంస్థ పత్రికలన్నిటికీ ఒంటిచేతితో పుంఖానుపుంఖాలుగా సినిమా సమాచారం రాస్తూ, పాతికేళ్ళ పైనే పనిచేశారు. మధ్యలో దాసరి ‘ఉదయం’, ‘శివరంజని’ పత్రికల వైపు వెళ్ళినా, కొద్దిరోజులకే తన మాతృసంస్థకు వచ్చేశారు. జ్యోతిచిత్ర వీక్లీలో ఎన్టీఆర్ ‘నా దేశం’ సినిమా గురించి సీరియల్ రాసిందీ, అభినేత్రి సావిత్రి జీవచ్ఛవంలా మంచంపై పడి ఉంటే, ఆ విషాదానికి కారణమైన పరిస్థితులు, వ్యక్తులపై గ్రౌండ్ రిపోర్టుతో 1981లో వరుస సంచలనాత్మక కథనాలు ‘జ్యోతిచిత్ర’లో, సీరియల్గా ‘వనితాజ్యోతి’లో రాసిందీ ఆయనే. సావిత్రిపై వచ్చిన బయోపిక్కు ఆయన కథనాల ‘అద్భుత నటి సావిత్రి’ పుస్తకమూ ఆధారమైంది. అయితే, దర్శక, నిర్మాతలు ఆయన పేరెక్కడా ప్రస్తావించనైనా లేదు. పరుషంగా మాట్లాడడం తెలియని రామారావు అప్పుడూ ఆంతరంగికంగా ఆవేదన చెందారే తప్ప, మాటల్లో మాత్రం అదుపు తప్పలేదు.
రాయడం... పసుపులేటి రామారావుకు ప్రాణవాయువు. ఆయనకు తెలిసిన విద్య కూడా అదే. ఎన్టీయార్, ఏయన్నార్, యస్వీఆర్ నుంచి ఈనాటి అనుష్క దాకా స్టార్లు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు.... చివరకు సెట్లో లైట్బాయ్స్ దాకా అందరూ ఆయనకు తెలుసు! వాళ్ళందరికీ ఆయనెవరో, ఎంత సీనియరో బాగా తెలుసు! కానీ వచ్చిన చిక్కేమిటంటే... ఇన్నేళ్ళ రంగుల ప్రపంచపు అనుభవం తరువాతా... రామారావుకు చాలా సంగతులు తెలీదు, తెలియలేదు. మనుషుల్ని పట్టుకోవడం ఆయనకు తెలీదు. పైరవీలు చేయడం అస్సలు తెలీదు! ఉద్యోగంలో ఇస్తానన్న జీతం, చేసిన పీఆర్వో పనికి ఇవ్వాల్సిన పారితోషికం, అవతలివాడు తన దగ్గరే తీసుకున్న అప్పు – ఎగ్గొట్టినప్పటికీ వాళ్ళను నిలదీయడం చివరి రోజుల దాకా రామారావుకు తెలీదు. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బు ఆగిపోయిన సినిమా మిత్రుడికిచ్చి, ఆఖరుకు తన డబ్బులు తానే అడగలేనంత మొహమాటస్థుడు. ఇవాళ్టివాళ్ళ లెక్కలో బతకడం తెలియనివాడు. లేకపోతే, దాదాపు అయిదు దశాబ్దాలుగా సినీ పత్రికారంగంలో ఉన్న రామారావుకు... ఎన్ని (నంది) అవార్డులు రావాలి! ఎన్ని రివార్డులు ఇవ్వాలి! ఈ పాటికి ఆయన ఎన్ని మేడలు కట్టాలి! ఎన్ని మిద్దెలు సంపాదించాలి! ఆ మాటే రామారావుతో అంటే నవ్వేసేవారు. మద్రాసు టీ నగర్ చారి స్ట్రీట్కు హీరో చిరంజీవి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆప్యాయంగా భోజనం చేసిన చిన్న ఇంట్లో ఉన్నప్పటి నుంచి... ఇప్పుడు హైదరాబాద్ అన్నపూర్ణా ఏడెకరాల దగ్గర బస్తీలో లేకలేక కలిగిన ఇంటర్ వయసు పిల్లాడు, భార్యతో మధ్యతరగతి జీవితమే గడిపేసిన దాకా... ఆయనలో అదే చిరునవ్వు.
పుస్తకాల ప్రొడక్షన్ విలువలు పక్కనపెట్టి, రామారావు రాసిన అక్షరాలలో ఆర్ద్రతను చూస్తే కన్నీళ్ళు వస్తాయి. సావిత్రి మద్యానికి బానిసైంది ఎలా? శ్రీదేవి, బోనీ కపూర్ని ఎందుకని పెళ్ళాడారు? దర్శకుడు రాజా రవిచంద్ర హత్య వెనుక ఉన్నదెవరు? గాయని జమునారాణి గొంతు నొక్కేసిన సినీ పాలిటిక్స్ ఏంటి? డేట్లు చూడమన్న సిల్క్ స్మితను... ఉరికి వేలాడుతున్న శవంగా చూసినప్పటి మానసిక సంఘర్షణ ఏమిటి? తాగుడు మింగేసిన రాజబాబులు, హరనాథరాజులు... ఆర్థిక ఇబ్బందుల కోరలకు చిక్కిన జయకృష్ణలు... ఆప్యాయంగా పలకరించే దిక్కు లేక అలమటించిన రంగనాథ్లు... అవకాశాల కోసం అర్థించిన రాజనాలలు... కాపీ స్టెప్పులు చేయనంటూ స్టార్ హీరోను కాదని కోపంలో కెరీర్నే పోగొట్టుకున్న సలీమ్ మాస్టర్లు... బతికిచెడ్డ మహానటులు... బతకలేక చావును కౌగిలించుకున్న అందాల తారలు... ఎందరెందరో ఆయన రాతల్లో కనిపిస్తారు. కన్నీళ్ళు తెప్పిస్తారు. ఆ రచనలు సావిత్రి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు ఎంతోమందిని కలిసి, మాట్లాడి రామారావు రాసిన మన సినిమా చరిత్ర. క్యాన్సర్తో తీసుకుంటూ, అపోలోలో ఆప్తమిత్రుడైన నటుడు మాదాల రంగారావు చేతిలో దర్శకుడు టి.కృష్ణ కన్నుమూసిన ఘట్టం లాంటి చారిత్రక ఘటనలెన్నిటికో పసుపులేటి రామారావు ప్రత్యక్షసాక్షి. మద్రాసు అరుణాచలం స్టూడియోలో షూటింగ్లో పొద్దుటి నుంచి టీ నీళ్ళు తప్ప మరేమీ తాగక చేతులు వణుకుతున్న సావిత్రికి స్వయంగా ఇన్సులిన్ ఇంజక్షన్ చేసిందీ ఆయనే. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లాంటి ఎందరినో సిని రంగంలోకి తెచ్చి, నిలదొక్కుకొనేలా ప్రోత్సహించిందీ రామారావే. ‘ప్రాణం ఖరీదు’ రిలీజైనప్పుడు చూసి, తొలిచిత్రమైనా చిరంజీవి అనే నటుడు బాగా చేశాడంటూ, వృద్ధిలోకి వస్తాడంటూ పత్రికలో వ్యాసం రాశారాయన. అది చదివిన చిరంజీవి ఉబ్బితబ్బిబ్బయి, వెతుక్కుంటూ వచ్చి మరీ కృతజ్ఞతగా కొన్ని నోట్లు జేబులో పెట్టబోతే, ఉద్యోగాభిమానాన్నీ, అక్షరాన్నీ వెలకట్టరాదని సున్నితంగా తిరస్కరించిన నిస్వార్థపరుడు రామారావు. 88 ఏళ్ళ తెలుగు సినీచరిత్రలో 50 ఏళ్ళు మరోవైపు చూపు లేకుండా, నిరంతరాయంగా రాస్తూ, సినిమాతో కలసి నడచిన అరుదైన సినీజర్నలిస్టు కాబట్టే రామారావుది ఒక మరవలేని అధ్యాయం. ఎక్కడ ఏ ప్రెస్ మీటైనా నిర్ణీత సమయం కన్నా ముందే ఉండాలి, రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆనాటి వార్తలు ఆనాడే ఆఫీసులో రాసి మరీ ఇంటికి వెళ్ళాలి –- ఇవీ రామారావు జీవితాంతం పాటించిన సూత్రాలు. అయిదు దశాబ్దాల సినీ పత్రికా రచనలో రామారావు చేతి సంచీ నిండా సంపాదించుకొని ఉండకపోవచ్చు. కానీ ఎంతోమంది అభిమానం, గౌరవం సంపాదించుకున్నారు. కృతజ్ఞత తగ్గిపోతున్న ఈ నిరుపేద సినీరంగానికి మరెంతో తన సంచీ నుంచి ఇవ్వాల్సి ఉండగానే వెళ్ళిపోయారు. నమ్ముకున్న వృత్తికే అంకితమైన అక్షరజీవికి ఇది నాలుగు అక్షరాల ఆత్మీయ నివేదన!
డాక్టర్ రెంటాల జయదేవ
Updated Date - 2020-02-16T06:27:33+05:30 IST