రూ. 5 వేల వరకు పిన్ అవసరం లేదు...
ABN, First Publish Date - 2020-12-04T20:58:06+05:30
కరోనా దశలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే... వైఫల్యాలు, మోసాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)... కొత్తగా ‘డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్’ నిబంధనలను జారీ చేయనుంది.
ముంబై : కరోనా దశలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే... వైఫల్యాలు, మోసాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)... కొత్తగా ‘డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్’ నిబంధనలను జారీ చేయనుంది. సెంట్రల్ బ్యాంకు తన ‘స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్’ సందర్భంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపు భద్రత నియమాలకు సంబంధించిన ఆదేశాలను జారీ చేయనుందని వెల్లడించింది.
మార్గదర్శకాలు విడిగా...
నెట్ బ్యాంకింగ్ బదిలీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ లావాదేవీలకు సంబంధించి మరింత భద్రత చేకూరేలా నిబంధనలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా... లావాదేవీల వైఫల్యం రేటు కనిష్టానికి తగ్గనుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ భద్రతా నియంత్రణకు అధిక ప్రాముఖ్యతనిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
రూ. 2 వేల నుండి రూ. 5 వేలకు పెంపు...
కాంటాక్ట్లెస్ కార్డ్ లావాదేవీల పరిమితిని జనవరి ఒకటి నుండి రూ. 2 వేల నుండి రూ. 5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ అవసరాల మేలావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2 వేల వరకు చెల్లింపులు, ‘లావాదేవీ’ పిన్ నంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని రూ. 5 వేల వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయించింది.
24X7 అందుబాటులోకి...
‘ఆర్టీజీఎస్’ కూడా 24X7 అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. అనునిత్యం ఏఈపీఎస్, ఐఎంపీఎస్, ఎన్ఈటీసీ, ఎన్ఎఫ్ఎస్, రూపే, యూపీఐ లావాదేవీల సదుపాయముంటుందని వెల్లడించారు.
Updated Date - 2020-12-04T20:58:06+05:30 IST