ట్రాక్టర్ టాప్ గేర్!
ABN, First Publish Date - 2020-08-02T06:15:12+05:30
దేశవ్యాప్తంగా మెరుగైన వర్షపాతం..ఊపందుకున్న వ్యవసాయం.. ప్రభు త్వ పథకాలతో రైతుల చేతుల్లోకి నగదు వచ్చి చేరడంతో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకున్నాయి. మహీంద్రా ట్రాక్టర్ల
- జూలైలో జోరందుకున్న విక్రయాలు
- కార్లు, టూవీలర్ల సేల్స్ అంతంతే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెరుగైన వర్షపాతం..ఊపందుకున్న వ్యవసాయం.. ప్రభు త్వ పథకాలతో రైతుల చేతుల్లోకి నగదు వచ్చి చేరడంతో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకున్నాయి. మహీంద్రా ట్రాక్టర్ల దేశీయ అమ్మకాలు జూలైలో 23 శాతం ఎగబాకాయి. ఇప్పటివరకు కంపెనీకిదే అత్యధిక జూలై సేల్స్ అని మహీంద్రా తెలిపింది. ఎస్కార్ట్స్ 9.9 శాతం, సోనాలికా ఏకంగా 71 శాతం వృద్ధిని కనబర్చాయి. మిగతా వాహన విభాగాల్లో మాత్రం విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ జూన్తో పోలిస్తే కాస్త మెరుగుపడినప్పటికీ గత ఏడాది జూలైతో పోలిస్తే తగ్గాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో అతిపెద్ద కంపెనీ మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి. కానీ, మొత్తం విక్రయాలు 1.1 శాతం తగ్గాయి.
గత జూలైతో పోలిస్తే మిగతా పెద్ద కార్ల కంపెనీల అమ్మకాలూ క్షీణించాయి. ద్విచక్ర వాహనాల కంపెనీలదీ అదే పరిస్థితి. వాణిజ్య వాహనాలు, త్రిచక్ర వాహనాలు కొనేవారే కరువయ్యారు. దాంతో విక్రయాలు దారుణంగా పడిపోయాయని కంపెనీలంటున్నాయి. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో పాటు సరఫరా ఇబ్బందులు అమ్మకాలపై ప్రభావం చూపాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2020-08-02T06:15:12+05:30 IST