విపణిలోకి టయోటా ‘వెల్ఫైర్’
ABN, First Publish Date - 2020-02-27T06:11:34+05:30
ప్రపంచ స్థాయి లగ్జరీ వాహనం ‘టయోటా వెల్ఫైర్’ను భారత విపణిలోకి టయోటా కిర్లోస్కర్ మోటార్ (కేటీఎం) విడుదల చేసింది. సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమైన ‘వెల్ఫైర్’ మల్టీ పర్పస్ వేహికల్ ...
- ఎగ్జిక్యూటివ్ లాంజ్ స్థాయిలో సదుపాయాలు
- సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఈవీ 8 హైదరాబాద్లో విడుదల
- ధర రూ.79.5 లక్షలు.. లీటరుకు 16.35 కి.మీ మైలేజీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రపంచ స్థాయి లగ్జరీ వాహనం ‘టయోటా వెల్ఫైర్’ను భారత విపణిలోకి టయోటా కిర్లోస్కర్ మోటార్ (కేటీఎం) విడుదల చేసింది. సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమైన ‘వెల్ఫైర్’ మల్టీ పర్పస్ వేహికల్ (మినీ వ్యాన్). భారత్ మార్కెట్లో టయోటా తొలి లగ్జరీ వాహనం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షల వెల్ఫైర్ వాహనాలను విక్రయించామని.. తాజాగా భారత విపణిలోకి విడుదల చేస్తున్నామని కేటీఎం వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల తరహాలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు.
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో 40 శాతం దూరం, సమయం పరంగా 60 శాతం వాహనం విద్యుత్ మీదే నడుస్తుంది. కేరళ మినహా దేశ వ్యాప్తంగా ‘వెల్ఫైర్’ ఎక్స్షోరూమ్ ధర రూ.79.5 లక్షలు ఉంటుంది. సమీప భవిష్యత్తులో దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ వాహనాన్ని విడుదల చేసే వీలుందని విక్రమ్ అన్నారు. వెల్ఫైర్ కారులోని ఇంటీరియర్లు, సీట్లు, ఇతర సదుపాయాలు పెద్ద ఎగ్జిక్యూటివ్ లాంజ్ని తలపించే విధంగా ఉంటాయన్నారు. 2.5 లీటర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజిన్, డ్యుయల్ మోటర్లు ఉంటాయి. ప్రామాణిక పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్కు 16.35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు. 4 సిలెండర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజిన్ 115 బీహెచ్పీ పవర్ను విడుదల చేస్తుంది. గరిష్ఠ 2800-4,000 ఆర్పీఎం వద్ద 198 ఎన్ఎం టర్క్ ఉంటుంది.
హైదరాబాద్లో ఎందుకంటే..
వెల్ఫైర్ను హైదరాబాద్లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు. మూడు విడతల్లో అందుబాటులోకి వచ్చే 180 కార్లకు ఇప్పటికే బుకింగ్లు వచ్చాయని.. ఇందులో 20 శాతం బుకింగ్లు హైదరాబాద్ నుంచే జరిగాయని నవీన్ సోనీ తెలిపారు. అందుకే వెల్ఫైర్ విడుదలకు హైదరాబాద్ను ఎంచుకున్నామన్నారు. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకునే వారు ఏప్రిల్ వరకూ వేచి ఉండాల్సిందేనని తెలిపారు.
Updated Date - 2020-02-27T06:11:34+05:30 IST