ఒరిగిన ఐటీ శిఖరం
ABN, First Publish Date - 2020-11-27T06:24:12+05:30
భారత ఐటీ రంగ ఆద్యుడు ఫకీర్ చంద్ కోహ్లీ ఇక లేరు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వ్యవస్థాపకుడు, కంపెనీ తొలి సీఈఓ అయిన ఎఫ్సీ కోహ్లీ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయసు
టీసీఎస్ వ్యవస్థాపక సీఈఓ ఎఫ్సీ కోహ్లీ కన్నుమూత
ముంబై: భారత ఐటీ రంగ ఆద్యుడు ఫకీర్ చంద్ కోహ్లీ ఇక లేరు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వ్యవస్థాపకుడు, కంపెనీ తొలి సీఈఓ అయిన ఎఫ్సీ కోహ్లీ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయసు 96 ఏళ్లు. ఆయన మృతికి ఐటీ సహా అన్ని రంగాల ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
పెషావర్లో జననం: ప్రస్తుతం పాకిస్థాన్లో భాగమైన పెషావర్లో 1924లో పుట్టి, పెరిగిన కోహ్లీ.. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్సి టీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. 1951 లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు.
తొలుత టాటా ఎలక్ట్రిక్లో చేరిక: మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత భారత్కు తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్లో చేరారు. జేఆర్డీ టాటా ప్రోద్భలంతో 1969లో టీసీఎ్సను ఏర్పాటు చేశారు. రెండున్నర దశాబ్దాలకు పైగా టీసీఎ్సను ముందుండి నడిపించిన కోహ్లీ.. 1996లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 1995-96 మధ్యకాలంలో ఐటీ రంగ మండలి నాస్కామ్కు ప్రెసిడెంట్గానూ వ్యవహరించారు.
2002లో పద్మ భూషణ్: ఐటీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను ఆయనకు 2002లో పద్మ భూషణ్ లభించింది. అంతేకాదు, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, యూకేలోని రాబర్ట్ గార్డన్ యూనివర్సిటీ, శివ్నాడార్ యూనివర్సిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, జాదవ్పూర్ యూనివర్సిటీ, క్వీన్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి గౌరవ డిగ్రీలు అందుకున్నారు.
ఐటీ ప్రపంచానికి మార్గదర్శక సేవలందించిన కోహ్లీ కలకాలం గుర్తుండిపోతారు. ఆవిష్కరణల సంస్కృతితో పాటు టెక్నాలజీ రంగంలో ప్రాశస్త్యాన్ని వ్యవస్థాగతం చేయడంలో కీలక వ్యక్తి. ఆయన మరణం ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
- నరేంద్ర మోదీ, ప్రధాని
భారత ఐటీ రంగానికి పెద్ద దిక్కు, దార్శనికుడు అయిన కోహ్లీ సేవలు, గొప్ప నాయకత్వం కలకాలం గుర్తుండిపోతుంది.
- నాస్కామ్
ఆయన ఐటీ లెజెండ్. భారత్లో ఐటీ విప్లవానికి బీజం వేశారు. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసిన వ్యక్తి.
- ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్
మేమంతా ఆయన బాటను అను స రించాం. ఐటీ రంగానికి, దేశానికి ఆయన అపారమైన సేవలందించారు.
- అజీమ్ ప్రేమ్జీ, విప్రో చైర్మన్
Updated Date - 2020-11-27T06:24:12+05:30 IST