వచ్చే వారం గ్లాండ్ ఫార్మా ఐపీఓ!
ABN, First Publish Date - 2020-11-03T05:51:05+05:30
హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మా వచ్చే వారంలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,000 కోట్లు సమీకరించనుంది...
- రూ.6,000 కోట్ల సమీకరణ.. అతిపెద్ద ‘ఫార్మా’ పబ్లిక్ ఇష్యూ ఇదే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన గ్లాండ్ ఫార్మా వచ్చే వారంలో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,000 కోట్లు సమీకరించనుంది. దేశంలో ఐపీఓ ద్వారా ఇంత మొత్తంలో నిధులు సమీకరించనున్న తొలి ఫార్మా కంపెనీ ఇదే అవుతుంది. 2017లో ఏరిస్ లైఫ్సైన్సెస్ రూ.1,741 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇప్పటి వరకూ దేశీయ ఫార్మా రంగంలో ఇదే పెద్ద పబ్లిక్ ఇష్యూ. అంతకు ముందు 2015లో లారస్ ల్యాబ్స్ రూ.1,350 కోట్లు సమీకరించింది. చైనాకు చెందిన ఫోసన్ ఫార్మా కు గ్లాండ్ ఫార్మాలో మెజారిటీ వాటా ఉంది. గ్లాండ్ ఫార్మాలో ఫోసన్ సింగపూర్కు 74 శాతం వాటా ఉంది. కాగా గ్లాండ్ ఫార్మా రూ.6,000 కోట్ల ఐపీఓకు గత వారం సెబీ పచ్చజెండా ఊపింది.
ఐపీఓలో భాగంగా రూ.1,250 కోట్ల వరకు కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ ఫ్ఎస్) ద్వారా ఇప్పటికే వాటాదారుల వద్ద ఉన్న దాదాపు 3.49 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటి విలువ దాదాపు రూ.4,750 కోట్లు. ఇందులో ఫోసన్ దాదాపు 1.9 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. కంపెనీల్లో గ్లాండ్ సెల్సస్ బయో కెమికల్స్కు 12.97 శాతం వాటా ఉంది. ఇది కోటి షేర్లను విక్రయించే వీలుంది. ఎంపవర్ డిస్క్రిషనరీ ట్రస్ట్ 35.73 లక్షలు, నిలే డిస్క్రిషనరీ ట్రస్ట్ 18.45 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా లభించే నిధులను నిర్వహణ మూలధనం, ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూకు కోటక్ మహీంద్రా కేపిటల్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, హైటంగ్ సెక్యూరిటీస్, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్.. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. చైనా కంపెనీకి మెజారిటీ వాటా ఉండి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదవుతున్న తొలి కంపెనీ గ్లాండ్ ఫార్మానే కావటం గమనార్హం.
Updated Date - 2020-11-03T05:51:05+05:30 IST