ఎయిరిండియా కోసం... ఉద్యోగులతో కలిసి బరిలోకి అమెరికా సంస్థ...
ABN, First Publish Date - 2020-12-15T19:14:06+05:30
భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే దేశీయ టాప్ కంపెనీ టాటా గ్రూప్... ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి... ‘ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)’ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ : భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే దేశీయ టాప్ కంపెనీ టాటా గ్రూప్... ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి... ‘ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)’ దాఖలు చేసింది.
కాగా ఈఓఐ దాఖలుకు గడువు ముగిసిన సోమవారం నాటికి... మరికొన్ని సంస్థలు కూడా బిడ్స్ దాఖలు చేశాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. టాటాతో పాటు ఇంటరప్స్ సంస్థ కూడా ఈఓఐ దాఖలు చేసింది.
ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి, పలు ఈఓఐ లు దాఖలయ్యాయని ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు. కాగా బిడ్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
బిడ్ దక్కించుకునే సంస్థకు... ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం వాటా దక్కుతుంది. దేశీయ విమానాశ్రయాల్లో 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, విదేశీ విమానాశ్రయాల్లో 900 పార్కింగ్ స్లాట్స్ దక్కుతాయి. ఇక... కార్గో, గ్రౌండ్, హ్యాండ్లింగ్ సేవలనందించే ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటా ఉంటుంది.
కాగా... బిడ్స్ అర్హతపై జనవరి 6 లోగా ఆయా బిడ్డర్లకు ట్రాన్సాక్షన్స్ సలహాదారు సమాచారం అందించనున్నారు. కాగా... ఉద్యోగులు 51 శాతం వాటా, మిగతా వారు 49 శాతం వాటాను కొనేందుకు ఇంటరప్స్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక... ఇంటరప్స్ సంస్థ చైర్మన్ లక్ష్మీప్రసాద్ తెలుగువాడే కావడం విశేషం.
అప్పులు కూడా...
ఎయిరిండియాను 1932 లో టాటా ఎయిర్ లైన్స్ పేరిట టాటా గ్రూప్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇది... 1946 లో ఎయిర్ ఇండియాగా మారింది. 1953లో ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఇక... 67 సంవత్సరాల తర్వాత అదే ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు టాటా సంస్థ ముందుకు రావడం గమనార్హం.
ఇక... ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో నిలిచే కంపెనీ రూ. 23 వేల కోట్ల రుణాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా మొత్తం రుణాలలో మిగిలిన వాటాను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎస్పీవీ కి బదలీ చేయనున్నారు.
Updated Date - 2020-12-15T19:14:06+05:30 IST