దివీస్ లాభంలో 33% వృద్ధి
ABN, First Publish Date - 2020-06-07T05:58:31+05:30
దివీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.388 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.292 ....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దివీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.388 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.292 కోట్లతో పోలిస్తే 33 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.1,308 కోట్ల నుంచి రూ.1,466 కోట్లకు చేరింది. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.1,353 కోట్ల నుంచి రూ.1,377 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్త ప్రాజెక్టులు వెనుకబడిన జిల్లాల్లో ఏర్పాటు చేసినందున పన్ను ప్రోత్సాహకాలు పొందినట్లు..రూ.33.70 కోట్లు పన్నులు వెనక్కి వచ్చినట్లు దివీస్ లాబ్స్ తెలిపింది. దాదాపు రూ.1,200 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ సమీపంలోని యూనిట్-1లో డీసీ-సెజ్ పేరుతో విస్తరణను చేపట్టింది. విశాఖపట్నంలోని యూనిట్-2లో డీసీవీ సెజ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టుల్లో, ఇప్పటికే ఉన్న సదుపాయాల విస్తరణలో భాగంగా రూ.876 కోట్ల విలువైన ఆస్తులను నిర్మించింది. ఈ ఏడాది చివరి నాటికి మరో రూ.920 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
Updated Date - 2020-06-07T05:58:31+05:30 IST