మెడికల్ భూమ్..భూమ్
ABN, First Publish Date - 2020-12-30T05:37:13+05:30
ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన హామీలో భాగంగా కేంద్ర సహకా రంతో ప్రతి కొత్త జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
నరసాపురంలో వైద్య కళాశాలపై వీడని సస్పెన్స్
రూ.300 కోట్లపైనే రియల్ బిజినెస్
పెట్టుబడిదారుల్లో ఆందోళన
(నరసాపురం)
నరసాపురం పట్టణానికి చెందిన వెంకటేష్కు మండలంలోని తీర ప్రాంతంలో అర ఎకరం పొలం ఉంది. దీన్ని రూ.10 లక్షలకు విక్రయించి మరో రూ.15 లక్షలు అప్పు చేసి మెడికల్ కాలేజీకి కేటాయించిన సమీపంలో ఐదు సెంట్లు స్థలం కొనుగోలు చేశాడు. కాలేజీ నిర్మాణం జరిగితే భూమికి రెక్కలొస్తాయన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు.
పట్టణంలోని ఒక వ్యాపారి దాచుకున్న సొమ్ము పెట్టి మెడికల్ కాలేజీకి సమీపంలో అర ఎకరం కొనుగోలు చేశాడు. నెల రోజుల క్రితం దీన్ని కొందరు రియల్ వ్యాపారులు రూ.80 లక్షలకు అడిగారు. అయితే కాలేజీ వస్తుందన్న ఉద్దేశంతో విక్రయించలేదు.
కృష్ణా జిల్లాకు చెందిన ఒక బడా బాబు నరసాపురం ప్రాంతంలో సుమారు 3 ఎకరాలు కొనుగోలు చేశాడు. జిల్లా కేంద్రం అవుతుందన్న ఉద్దేశంతోనే పట్టణానికి సమీపంలో భూములు కొన్నాడు. గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు రూ.300 కోట్లుపైనే రియల్ లావాదేవీలు జరిగాయి. సరిపల్లి, లిఖితపూడి, స్టేషన్ పేట ప్రాంతాల్లో కూడా విచ్చల విడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. వేసిన ప్లాటు వేసినట్టే అమ్ముడైపోయాయి.
ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన హామీలో భాగంగా కేంద్ర సహకా రంతో ప్రతి కొత్త జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆఽళ్ళ నాని నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో సేకరించిన 50 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అసలు ఈ స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి సేకరించారు. ఎకరాకు రూ.45 లక్షలు చొప్పున చెల్లించారు. ఆ సమయంలో పరిసర ప్రాంత రైతులు కూడా ఇళ్ల స్థలాల కోసం వారి భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఎప్పుడైతే మెడికల్ కాలేజీ పేరు బయటకు వినిపించిందో అమ్మేం దుకు వెనక్కు తగ్గారు. దీంతో ఇళ్ల స్థలాలకు రుస్తుంబాద మంగళగుంట పాలెంలో స్థల సేకరణ చేపట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచే మెడికల్ కాలేజీ పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామంలోని భూములు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. పట్టణానికి సమీపంలో ఉన్న స్టేషన్పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లోని భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎకరం రూ.1.50 కోట్లు మధ్యనే ఉండేది. మెడికల్ కాలేజీ ప్రతిపాదన రాగానే ఎకరం రూ 2.50 కోట్లుకు దాటింది. కాలేజీకి ప్రతిపాదించిన స్థలం సమీపంలో అయితే రూ.3 కోట్లు వరకు పలికింది. ఈ ఐదు నెలల కాలంలో లిఖితపూడి, సరిపల్లి గ్రామాల్లో వేసిన రియల్ ఎస్టేట్ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ ఐదు నెలల కాలంలో సుమారు రూ..300 కోట్లుపైనే భూముల లావాదేవీలు జరిగినట్లు అంచనా..
సీను మారిందా.. గోవిందా..!
రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం నరసాపురం ప్రాంతంలో పోర్టు నిర్మిస్తామని ప్రకటించింది. ఆ సమయంలో కూడా స్థానికులతో పాటు ఇతర జిల్లాకు చెందిన వారు కూడా తీర ప్రాంతంతో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. తీరా పోర్టు రాక పోవడంతో ఇప్పటికీ ఈ భూముల్ని అమ్ముకుందామంటే సగం ధర కూడా పలకడం లేదు. ప్రస్తుతం మెడికల్ కాలేజీపై కూడా సైలెంట్ అయిపోవడంతో భూములు కొన్న వారిలో కొత్త టెన్షన్ నెలకొంది. ఈనెల ఆరంభం నుంచి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఎటువంటి హడావుడి కనిపించడం లేదు. కనీసం ప్రభుత్వం, ఇటు స్థానిక నేతల నుంచి కూడా స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మెడికల్ కాలేజీ వస్తుందా ? లేదా అన్న చర్చే జోరుగా సాగుతోంది. ఒకవేళ సీన్ తిరగబడితే పెట్టిన పెట్టుబడులు తిరిగి రావాలంటే పది నుంచి 20 ఏళ్లు గడిచినా తిరిగిరాని పరిస్థితి. అమ్ముదామన్నా కొనే నాథుడు కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం రియల్ బూమ్ కూడా జోరు తగ్గడంతో కొన్న వాళ్లు చేతులు మార్చుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
Updated Date - 2020-12-30T05:37:13+05:30 IST