టీడీపీకి షాక్
ABN, First Publish Date - 2020-03-16T11:42:51+05:30
పోడూరు మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి నడింపల్లి వెంకట శివరా మకృష్ణం రాజు(మురళీరాజు)
పోడూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి వైసీపీలోకి..
మంత్రి రంగనాథరాజు సమక్షంలో చేరిక
పోడూరు, మార్చి 15 : పోడూరు మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి నడింపల్లి వెంకట శివరా మకృష్ణం రాజు(మురళీరాజు) ఆదివారం తూర్పుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎలక్షన్ కమిషన్, చంద్రబాబు చేసిన దురాగతాలపై ఆగ్రహించి మురళీరాజు వైసీపీలో చేరారని తెలిపారు. చంద్రబాబు బంధువైన ఎన్నికల కమిషనర్ విచక్షణారహితంగా కరోనా వైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేశారని, దీనిని నిరసిస్తూ మురళీరాజు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఆయన జడ్పీటీసీ పోటీ నుంచి విరమించి వైసీపీ అభ్యర్థి గుంటూరి పెద్దిరాజుకు మద్దతు తెలుపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో మురళీరాజుకు వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పోడూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్ధి గుంటూరి పెద్దిరాజు, చేకూరి సూరిబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైసీపీకి పోటీగా జనసేన
పోడూరు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు వైసీపీ అభ్యర్థి గుంటూరి పెద్దిరాజుకు మద్దతివ్వడంతో ద్విముఖ పోటీ నెలకొంది. ఆదివారం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో జనసేన అభ్యర్థి బండారు రాజేష్, వైసీపీ అభ్యర్థి గుంటూరి పెద్దిరాజుల మధ్య పోటీ నెలకొంది.
Updated Date - 2020-03-16T11:42:51+05:30 IST