పరీక్ష లేకుండానే పాస్
ABN, First Publish Date - 2020-03-27T10:41:42+05:30
కరోనా వైరస్ భయాందోళనలు పాఠశాల విద్యార్థులకు సానుకూల ప్రయోజనాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా
6, 7, 8, 9 తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత
జిల్లా 2.06 లక్షల మందికి ప్రయోజనం
కరోనా ఎఫెక్ట్తో ప్రభుత్వం నిర్ణయం
ప్రశ్నా పత్రాలకు రూ.36 లక్షలు ఖర్చు
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 26 : కరోనా వైరస్ భయాందోళనలు పాఠశాల విద్యార్థులకు సానుకూల ప్రయోజనాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెమో నెంబరు 92 ఉత్తర్వులను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు ఏప్రిల్ 6 నుంచి 22వ తేదీ వరకు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించాల్సిన సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-2) పరీక్షలను నిర్వహించకుండానే సంబంధిత విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఎస్ఏ-2 పరీక్షలను రద్దు చేశారు. వాస్తవానికి ఎస్ఏ-2 పరీక్షల ప్రశ్నాపత్రాలు రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణా మండలి(ఎస్సీఈఆర్టీ) ఇప్పటికే జిల్లాకు పంపగా, ఆ మేరకు ప్రశ్నాపత్రాల ముద్రణ పూర్తయ్యింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నిమిత్తం రూ.36 లక్షలు ఖర్చు చేశారు.
2.06 లక్షల మంది పాసైనట్టే
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి 9వ తరగతి వరకు మొత్తం 2,06,240 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం గురువారం జారీచేసిన ఉత్తర్వులతో వీరంతా పైతరగతులకు పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయినట్టుగానే పరిగణిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఆశ్రం పాఠశాలలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం 1,30,670 మంది బాల బాలికలు ప్రయోజనం పొందనుండగా, అన్ఎయిడెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 75,570 మంది ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో 6వ తరగతి విద్యార్థులు 31,107 మంది, 7వ తరగతి 31,434 మంది, 8వ తరగతి 33,653 మంది, 9వ తరగతి 34,476 మంది ఉన్నారు. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు 20,509 మంది, 7వ తరగతి విద్యార్థులు 19,307 మంది, 8వ తరగతి విద్యార్థులు 17,999 మంది, 9వ తరగతి విద్యార్థులు 17,755 మంది ఉన్నారు.
Updated Date - 2020-03-27T10:41:42+05:30 IST