మంచానికి కట్టి... ఆపై నోట్లో ద్రావణం పోసి!
ABN, First Publish Date - 2020-04-12T19:05:00+05:30
అనుమానంతో భార్యను మంచానికి కట్టి..
సాలూరులో భార్యను హతమార్చిన భర్త
నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు
సాలూరు(విజయనగరం): అనుమానంతో భార్యను మంచానికి కట్టి ఆపై మరుగుదొడ్లు శుభ్రం చేసే ద్రావణాన్ని నోట్లో పోసి హతమార్చాడో భర్త. హత్యకు ప్రణాళిక వేసి అనంతరం తన భార్యే ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణలో భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి సాలూరు సీఐ సింహాద్రినాయుడు, ఎస్ఐ టి.శ్రీనివాసరావు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన బొర్రా తిరుపతిరావుకు, మక్కువ మండలం శంబర గ్రామానికి చెందిన పావనితో 2011లో వివాహమైంది. మొదట్లో వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి పిల్లలు శరణ్య (5), సాయి చరణ్ (6) ఉన్నారు. బతుకుతెరువు కోసం చెన్నయ్కి వెళ్లిన వీరు మళ్లీ పిల్లల చదువు కోసం సాలూరు వచ్చేశారు. పట్టణంలోని కోటవీధిలో ఓ అద్దె ఇంట్లో 2019 జూన్ నుంచి నివాసం ఉంటున్నారు. అప్పట్లోనే భార్యకు స్మార్ట్ ఫోన్ ఒకటి తిరుపతిరావు కొనిచ్చాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు భార్య ఫోన్లో వేరే వ్యక్తితో మాట్లాడినట్లు రికార్డింగ్లు, ఫొటోలు ఉండటం గమనించిన తిరుపతిరావు ఆమెను మందలించాడు. వివాహేతర సంబంధంపై అనుమానం ఉన్న వ్యక్తి పైన కూడా గత ఏడాది డిసెంబర్లో కేసు పెట్టాడు. ఈ ఘటన తర్వాత పావనికన్నవారింటికి వెళ్లిపోయింది. మళ్లీ కొద్దిరోజుల తర్వాత పెద్దలు కలుగజేసుకుని వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం తిరుపతిరావు ఓ ఆటో కొనుక్కొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇదిలా ఉండగా గత నెల 29వ తేదీన కుట్టుపనికి వెళ్తానని భార్య చెప్పగా తిరుపతిరావు అభ్యంతరం చెప్పాడు. ఆ సమయంలో గొడవ పడ్డాడు. చిన్న పాటి గొడవ కాస్తా పెద్దదైంది. కేకలు బయటకు వినిపించకుండా ఇంట్లో ఉన్న టీవీ సౌండ్ పెంచి మంచానికి భార్యను కట్టేశాడు. ఆటోను స్టార్ట్ చేయటానికి ఉపయోగించిన తాడుతో భార్య చేతులను కిటికీ, మంచానికి కట్టి ... మరుగుదొడ్లు శుభ్రపరిచే ద్రావణాన్ని నోట్లో పోసి చంపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆమె విడిపించుకోనే ప్రయత్నం చేసింది. దీంతో ఓ చేయి తాడు తెగిపోవటంతో వెంటనే దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశాడు.
ఆ రోజు ఉదయం 10- 11 గంటల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. పావని మృతిచెందగానే టీవీ ఆఫ్ చేసి తలుపులకు తాళం వేసి బయటకు వెళ్లాడు. ఇంటికి మధ్యాహ్నం వచ్చిన తిరుపతిరావు...భార్యను అప్పుడే చూసినట్టు నడించాడు. పొరుగింట్లో ఉన్న షర్మిలతో... తన భార్య ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆమె పావని మేనమామ శంకరరావుకు ఫోన్లో విషయం తెలిపింది. అనంతరం మేనమామతో పాటు తల్లిదండ్రులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భర్త తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు శనివారం నేరాన్ని అంగీకరించాడు. తిరుపతిరావును రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2020-04-12T19:05:00+05:30 IST