పాడి పశువుల పెంపకంతో ఆర్థిక భరోసా: జేసీ
ABN, First Publish Date - 2020-11-27T05:06:17+05:30
పాడి పశువుల పెంపకంతో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జేసీ జె.వెంకటరావు తెలిపారు.
విజయనగరం(ఆంధ్రజ్యోతి)
పాడి పశువుల పెంపకంతో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జేసీ జె.వెంకటరావు తెలిపారు. దీనిలో భాగంగా చేయూత, ఆసరా పథకాల కింద 70,960 మంది లబ్ధిదారులను జిల్లాలో ఎంపిక చేశామన్నారు. గురువారం డీఆర్డీఏ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. ముందుగా డీఆర్డీఏ పీడీ సుబ్బారావు మాట్లాడుతూ.. ఆసరా, చేయూత పథకాల కింద జిల్లాలో ఇప్పటికే సుమారు లక్షా 53 వేల మందికి కిరాణా, ఇతర వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించామని చెప్పారు. రెండో దశలో 41,339 మంది మహిళలకు ఆవులు, 9,567 మందికి గేదెలు, 8,412 మందికి గొర్రెలు, 11,582 మందికి మేకలు పంపిణీ చేయనున్నా మన్నారు. పశు సంవర్థకశాఖ జేడీ నర్సింహులు మాట్లాడుతూ.. తమకు కావల్సిన పశువులకు సంబంధించి లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకార పత్రం ఇవ్వాల న్నారు. అధికారుల సమక్షంలో రైతు భరోసా కేంద్రం వద్దే పశువుల క్రయ విక్ర యాల ఒప్పందం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర మండలాలు, జిల్లాల నుంచి కూడా పశువుల కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పశువులకు వైద్యులతోవివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొనుగోలు కు అనుమతించినట్లు చెప్పారు. శనివారం నుంచే క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ ఆదేశించారు. నియోజకవర్గానికి సంబంధించిన వివరాలను శాసనసభ్యులకు అందజేయాలన్నారు. డిసెంబరు- 25లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పశువుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినా, నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - 2020-11-27T05:06:17+05:30 IST